Hyderabad: వెలుగులోకి నకిలీ అల్లం వెల్లుల్లి పేస్ట్ దందా.. రూ.22 లక్షల సామాగ్రి సీజ్

హైదరాబాద్‌లోని కాటేదాన్ పారిశ్రామిక ప్రాంతంలో ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న నకిలీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారీ కేంద్రం గుట్టును పోలీసులు రట్టు చేశారు.

By -  అంజి
Published on : 31 March 2026 12:12 PM IST

Adulterated Ginger Garlic Paste Raid, Kattedan Industrial Area Crime, Hyderabad Task Force Operation, Fake Food Products Bust 2026, Mylarardevpally Police Arrest, Food Safety Violations Hyderabad

Hyderabad: వెలుగులోకి నకిలీ అల్లం వెల్లుల్లి పేస్ట్ దందా.. రూ.22 లక్షల సామాగ్రి సీజ్

హైదరాబాద్‌లోని కాటేదాన్ పారిశ్రామిక ప్రాంతంలో ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న నకిలీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారీ కేంద్రం గుట్టును పోలీసులు రట్టు చేశారు. కమిషనర్ టాస్క్‌ఫోర్స్, హెచ్-ఫాస్ట్ బృందాలు సంయుక్తంగా నిర్వహించిన ఈ దాడిలో భారీ ఎత్తున కలుషిత ఆహార పదార్థాలను సీజ్ చేసి, నిందితుడిని కటకటాల వెనక్కి నెట్టారు.

కలుషిత అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారీ కేంద్రంపై దాడి

మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కాటేదాన్ ఐడీఏలో గల 'SKR ఫుడ్ ప్రొడక్ట్స్' పై పోలీసులు మెరుపు దాడి చేశారు. ఈ తనిఖీల్లో అబిడ్స్‌కు చెందిన హసన్ అలీ రూపానీ (55) అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఎటువంటి ఆహార భద్రతా ప్రమాణాల సర్టిఫికేట్ (FSSAI) లేకుండా, కేవలం లాభాపేక్షతో అత్యంత అపరిశుభ్రమైన వాతావరణంలో అల్లం వెల్లుల్లి పేస్ట్‌ను తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నాణ్యత లేని అల్లం, వెల్లుల్లి తొక్కలతో పాటు ఎసిటిక్ యాసిడ్, గ్జాంతమ్ గమ్ పౌడర్ వంటి ప్రమాదకర రసాయనాలను కలిపి ఈ పేస్ట్‌ను సిద్ధం చేస్తున్నట్లు తేలింది.

ఈ కేంద్రం నుండి సుమారు రూ. 22 లక్షల విలువైన సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో 4,032 కిలోల సిద్ధం చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్, 6,000 కిలోల నాణ్యత లేని వెల్లుల్లి, 210 కిలోల అల్లం, మరియు 5 గ్రైండింగ్ యంత్రాలు ఉన్నాయి. నిందితుడు ఈ కలుషిత పేస్ట్‌ను హోల్‌సేల్ కిరాణా దుకాణాలకు, క్యాటరింగ్ సర్వీసులకు సరఫరా చేస్తూ ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నాడని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్ తెలిపారు. ప్రస్తుతం నిందితుడిని తదుపరి చర్యల నిమిత్తం మైలార్‌దేవ్‌పల్లి పోలీసులకు అప్పగించారు.

Next Story