Hyderabad: చైనా మాంజా మెడకు చుట్టుకుని జవాన్ మృతి

ఓ జవాన్‌ చైనా మాంజా మెడకు చుట్టుకోవడంతో తీవ్ర గాయాలపాలై ప్రాణాలు కోల్పోయాడు.

By Srikanth Gundamalla  Published on  14 Jan 2024 12:00 PM GMT
Hyderabad, jawan, died, China Manja, Neck,

Hyderabad: చైనా మాంజా మెడకు చుట్టుకుని జవాన్ మృతి

సంక్రాంతి పండగ వేళ అందరూ ఎంజాయ్‌ చేస్తుంటారు. సంక్రాంతికి ఎక్కువగా గాలి పటాలు ఎగరేస్తూ ఎంజాయ్‌ చేస్తుంటారు. చిన్న పిల్లల నుంచి పెద్దవారు కూడా ఈ గాలిపటాలను ఎగరేస్తూ ఆటపాటలతో సందడి చేస్తారు. అయితే.. గాలి పటాలు ఎగరేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తరచూ చెప్తుంటారు. ముఖ్యంగా ప్రమాదకరమైన చైనామాంజా వంటివి వాడొద్దని సూచిస్తారు. కానీ.. కొందరు వీటిని పట్టించుకోరు. హైదరాబాద్‌లో సంక్రాంతి వేళ విషాదం చోటుచేసుకుంది. ఓ జవాన్‌ ఇదే చైనా మాంజా మెడకు చుట్టుకోవడంతో తీవ్ర గాయాలపాలై ప్రాణాలు కోల్పోయాడు.

కోటేశ్వర్‌రెడ్డి అనే వ్యక్తి ఆర్మీలో పనిచేస్తున్నాడు. పండగ సందర్భంగా ఇంటికి వెచ్చాడు. ఎంతో సంతోషంగా కుటుంబం ఉన్న సమయంలో జవాన్ ప్రాణాలు కోల్పోవడంతో అతని ఇంట్లో విషాద చాయలు అలుముకున్నాయి. లంగర్‌హౌస్‌లో ఫ్లై ఓవర్‌ వద్ద బండి మీద వెళ్తున్నాడు కోటేశ్వర్‌రెడ్డి. ఫైఓవర్‌ పైకి చేరుకోగానే అతని మెడకు చైనా మాంజా చుట్టుకుంది. చైనా మాంజా చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. అయితే.. బండిని ఆపి కంట్రోల్‌ చేసే సరికి కోటేశ్వర్‌రెడ్డి మెడ తెగిపోయింది. దాంతో.. అక్కడే కుప్పకూలిపోయాడు. ఇక స్థానికులు కోటేశ్వర్‌రెడ్డి కిందపడిపోవడాన్ని గమనించి వెంటనే అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చారు. దాంతో.. అతన్ని ఆస్పత్రిలో జాయిన్‌ చేశారు.

చికిత్స పొందుతూ జవాన్‌ కోటేశ్వర్‌రెడ్డి ప్రాణాలు కోల్పోయాడు. కోటేశ్వర్‌రెడ్డి స్వగ్రామం ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం. కుటుంబంతో కలిసి లంగర్‌హౌస్‌లో ఉంటున్నారు. శనివారం రాత్రి 7.20 గంటల సమయంలో ఈ విషాద సంఘటన చోటచేసుకుంది. ప్రాణాలు కోల్పోయిన తర్వాత కోటేశ్వర్‌రెడ్డి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరోవైపు అల్వాల్‌లో కూడా గాలిపటం ఎగరేస్తు యువకుడు బిల్డింగ్‌పై నుంచి కిందపడిపోయాడు. దాంతో.. అతినికి తీవ్ర గాయాలు అయ్యాయి. రక్త స్రావం అయ్యి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన యువకుడు పేట్‌బషీర్‌బాగ్‌ పోలీస్ స్టేషన్‌ ఏఎస్‌ఐ కుమారుడు ఆకాశ్‌గా గుర్తించారు. ఆకావ్‌ డెడ్‌బాడీని కూడా పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటనపైనా పోలీసులు కేసు నమోదు చేశారు.

Next Story