కేబుల్‌ బ్రిడ్జిపై సెల్ఫీ దిగుతుండగా హిట్‌ అండ్‌ రన్.. ఇద్దరు మృతి

అనిల్ (27), అజయ్‌ (25) అనే ఇదక్దరు వ్యక్తులు కేబుల్‌ బ్రిడ్జిని చూసేందుకు వెళ్లారు.

By Srikanth Gundamalla  Published on  6 April 2024 7:34 AM GMT
hyderabad, hit and run case, cable bridge, two died ,

కేబుల్‌ బ్రిడ్జిపై సెల్ఫీ దిగుతుండగా హిట్‌ అండ్‌ రన్.. ఇద్దరు మృతి 

కొందరు యువత సెల్ఫీల కోసం రిస్కీ పనులు చేస్తుంటారు. లైక్స్‌ రావాలనీ.. ఫేమస్ అవ్వడం కోసం కొందరు రీల్స్ చేస్తారు. ఈ క్రమంలోనే సోషల్‌ మీడియా మోజులో పడి ప్రమాదాల్లో పడుతుంటారు. తాజాగా హైదరాబాద్‌లోని కేబుల్ బ్రిడ్జిపైకి ఇద్దరు వ్యక్తులు సెల్ఫీ ల కోసం వెళ్లారు. ఈ క్రమంలోనే ఓ కారు వేగంగా వచ్చి ఇద్దరినీ ఢీకొట్టింది. దాంతో.. ఇద్దరికీ తీవ్ర గాయాలు అయ్యాయి. ఒకరు ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందగా.. మరో వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు.

మాదాపూర్‌లో శుక్రవారం ఈ ప్రమాదం జరిగింది. అనిల్ (27), అజయ్‌ (25) అనే ఇదక్దరు వ్యక్తులు కేబుల్‌ బ్రిడ్జిని చూసేందుకు వెళ్లారు. అక్కడ సెల్ఫీలు దిగారు. ఈ క్రమంలోనే రోడ్డుపై వస్తున్న వాహనాలను పట్టించుకోలేదు. అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో కేబుల్‌ బ్రిడ్జిపైకి వచ్చారు. ఈ క్రమంలోనే AP28DV7999 ఇన్నోవా కారు వేగంగా వచ్చి ఇద్దరు యువకులను ఢీకొట్టింది. ఆ తర్వాత కారు అక్కడ ఆపకుండా వెళ్లిపోయింది. కారు ఒక్కసారిగా ఢీకొట్టడంతో ఇద్దరికీ తీవ్ర గాయాలు అయ్యాయి.

ఈ ప్రమాదాన్ని గమనించిన ఇతర వాహనదారులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దాంతో.. పోలీసులు కూడా వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడ్డ వారిని మాదాపూర్ పేస్‌ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి తీసుకెళ్లగానే అనిల్‌ మృతిచెండాడు. విజయ్‌ మాత్రం చికిత్స పొందుతూ మృతిచెందాడని వైద్యులు వెల్లడించారు. ఇక ఈ ప్రమదానికి సంబంధించిన దృశ్యాలు కేబుల్‌ బ్రిడ్జిపై ఉన్న సీసీ కెమెరాల్లో నమోదు అయ్యాయి. ఈ దృశ్యాల ఆధారంగా పోలీసులు హిట్‌ అండ్‌ రన్‌ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఇద్దరు మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేబుల్‌ బ్రిడ్జిపై ర్యాష్ డ్రైవింగ్‌ వద్దనీ.. సెల్ఫీలు తీసుకునేవారు కూడా జాగ్రత్తగా ఉండాలని పోలీసులు పదేపదే చెబుతున్నారు. కానీ.. అప్పుడప్పుడు ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి.

Next Story