గణేష్ నిమజ్జనాల వేళ మెట్రో రైల్ సేవలు పొడిగింపు, బుధవారం రాత్రి 2 గంటల వరకు..
గణేష్ నిమజ్జనం రోజున మెట్రో రైళ్ల సర్వీసు సమయాన్ని పొడిగించారు అధికారులు.
By Srikanth Gundamalla Published on 15 Sept 2024 6:00 PM IST
హైదరాబాద్: గణేష్ నిమజ్జనం రోజున మెట్రో రైళ్ల సర్వీసు సమయాన్ని పొడిగించారు అధికారులు. అదనపు రద్దీని దృష్టిలో ఉంచుకుని అన్ని స్టేషన్లలో చివరి మెట్రో రైలు సెప్టెంబర్ 17న తెల్లవారుజామున 1 గంటలకు బయలుదేరుతుంది. మెట్రో రైళ్లు, స్టేషన్లలో ప్రతిరోజూ ఐదు లక్షల మంది ప్రయాణికులు భారీగా తరలివస్తున్నారు. వారిలో ఎక్కువ మంది గణేష్ చతుర్థి పండుగ సందర్భంగా ప్రయాణిస్తున్న వారే కావడం గమనార్హం.
ఖైరతాబాద్ గణేష్ని చూసేందుకు నగరంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చే సందర్శకుల సంఖ్య మరింత పెరిగింది. శనివారం మెట్రో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉందని చెప్పారు. ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ను 39,000 ఎంట్రీలు, 55,000 నిష్క్రమణలతో సుమారు 94,000 మంది ప్రయాణికులు సందర్శించినట్లు రికార్డులు చెబుతున్నాయి. మెట్రో రైళ్ల రద్దీని దృష్టిలో ఉంచుకుని.. ఈ సమస్యను తీర్చేందుకు ముఖ్యంగా ఖైరతాబాద్ స్టేషన్లో, HMRL MD NVS రెడ్డి ఆదివారం L&TMRHL MD KVB రెడ్డి సహా ఇతర సీనియర్ అధికారులతో సమావేశం నిర్వహించి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
* సెప్టెంబరు 17 (మంగళవారం) గణేష్ నిమజ్జనం ముగిసే వరకు అధిక ఫ్రీక్వెన్సీతో అదనపు రైళ్లు అవసరాన్ని బట్టి రద్దీ సమయాల్లో నడుస్తాయి.
* నిమజ్జనం రోజు అర్ధరాత్రి దాటినా రైళ్లు నడుస్తాయి. అన్ని దిశలలోని చివరి రైలు తెల్లవారుజామున 1 గంటలకు బయలుదేరి, బుధవారం తెల్లవారుజామున దాదాపు 2 గంటలకు వారి సంబంధిత గమ్యస్థానాలకు చేరుకుంటుంది.
* ఖైరతాబాద్, లక్డీకాపూల్ మెట్రో స్టేషన్లలో అదనపు పోలీసులు, ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బందిని మోహరిస్తారు. భద్రతా ఏర్పాట్లను హెచ్ఎంఆర్ఎల్ డీఎస్పీ స్థాయి పోలీసు అధికారులు పర్యవేక్షిస్తారు.
* డిమాండ్కు అనుగుణంగా ఎంపిక చేసిన మెట్రో స్టేషన్లలో అదనపు టిక్కెట్ కౌంటర్లు తెరవబడతాయి.
* ఖైరతాబాద్కు వచ్చే మెట్రో ప్రయాణికులు క్రమశిక్షణ పాటించాలని, తొక్కిసలాట జరగకుండా భద్రతా సిబ్బందికి సహకరించాలని ఎన్వీఎస్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.