హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (CCS) పోలీసులు 'గ్లోబల్ ఎంటర్ప్రైజెస్', 'రైజింగ్ గ్లోబల్ ఫౌండేషన్' పేర్లతో అమాయక పెట్టుబడిదారులను ముంచిన తుషార్ కుమార్ సవ్లానీ అనే వ్యక్తిపై కేసు నమోదు చేశారు. నిందితుడు నకిలీ ఫ్రాంచైజీ స్కీమ్ల పేరుతో సుమారు 29 మంది బాధితుల నుండి రూ. 3.27 కోట్ల మేర వసూలు చేసి పరారయ్యాడు. యాప్రాల్లోని జవహర్నగర్కు చెందిన టి. ప్రదీప్ కుమార్ అనే బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుతో ఈ మోసం వెలుగులోకి వచ్చింది.
సైబరాబాద్లోని హైటెక్స్లో జరిగిన ఒక ఎగ్జిబిషన్ ఎక్స్పోలో నిందితుడు సవ్లానీ పరిచయమయ్యాడని, యూట్యూబ్ వీడియోల ద్వారా తనను తాను ఒక పెద్ద సంస్థ వ్యవస్థాపకుడిగా అతను ప్రొజెక్ట్ చేసుకున్నాడని బాధితుడు తెలిపాడు. నిందితుడు "బెవరేజెస్ అండ్ గ్లోబల్ కిచెన్" పేరుతో లాభదాయకమైన వ్యాపారం చేస్తున్నానని నమ్మించి, వివిధ రకాల ఫ్రాంచైజీ మోడల్స్ను ప్రమోట్ చేశాడు. ఇందులో రూ. 5 లక్షల కాన్ఫిడెన్స్ మోడల్, రూ. 10 లక్షల ప్రీమియం ఫ్రాంచైజీ, రూ. 15 లక్షల నుండి రూ. 40 లక్షల వరకు మాస్టర్ ఫ్రాంచైజీ స్కీమ్లు ఉన్నాయి.
అధిక లాభాలు వస్తాయనే ఆశతో ప్రదీప్ కుమార్ మొదట రూ. 3.08 లక్షలు, ఆ తర్వాత విడతల వారీగా మొత్తం రూ. 57.43 లక్షలు చెల్లించాడు. అయితే, పెట్టుబడిదారుల నుండి కోట్లాది రూపాయలు వసూలు చేసిన తర్వాత సవ్లానీ తన కార్యాలయాన్ని మూసివేసి, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అదృశ్యమయ్యాడు. ఒక్క ప్రదీప్ కుమారే కాకుండా, మరో 28 మంది కూడా ఇదే విధంగా మోసపోయారని పోలీసుల విచారణలో తేలింది. ప్రస్తుతం సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు.