Hyderabad: సెల్లార్లో క్లాసులు.. ఆర్సీ రెడ్డి స్టడీ సర్కిల్కు రూ.36,240 జరిమానా
హైదరాబాద్లోని ఆర్సీ రెడ్డి స్టడీ సర్కిల్ సంస్థకు హైదరాబాద్ జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్-III కీలక ఆదేశాలు జారీ చేసింది.
By - అంజి |
Hyderabad: సెల్లార్లో క్లాసులు.. ఆర్సీ రెడ్డి స్టడీ సర్కిల్కు రూ.36,240 జరిమానా
హైదరాబాద్లోని ఆర్సీ రెడ్డి స్టడీ సర్కిల్ సంస్థకు హైదరాబాద్ జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్-III కీలక ఆదేశాలు జారీ చేసింది. క్లాసులను సెల్లార్లో నిర్వహించడం, విద్యార్థులకు అసౌకర్యం కలిగించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఒక విద్యార్థి చెల్లించిన ఫీజులో 80 శాతం (రూ. 21,240) మొత్తాన్ని 12 శాతం వడ్డీతో కలిపి తిరిగి చెల్లించాలని ఆదేశించింది. దీనితో పాటు రూ. 5,000 కోర్టు ఖర్చులు, రూ. 10,000 వినియోగదారుల చట్టపరమైన సహాయ నిధికి జమ చేయాలని స్పష్టం చేసింది.
మంచిర్యాల జిల్లాకు చెందిన బి. కుమారస్వామి అనే విద్యార్థి, నవంబర్ 11, 2024న గ్రూప్-II కోచింగ్ కోసం రూ. 26,550 ఫీజు చెల్లించి ఆర్సీ రెడ్డి స్టడీ సర్కిల్లో చేరాడు. అయితే, హిమాయత్నగర్లోని ఒక చర్చి ఆవరణలో ఉన్న సెల్లార్లో క్లాసులు నిర్వహిస్తున్నట్లు అతను గుర్తించాడు. కేవలం 60 నుండి 80 మంది పట్టే హాల్లో దాదాపు 300 మందిని కూర్చోబెట్టారని, బోధన కోసం 8 స్పీకర్లను ఏర్పాటు చేశారని అతను ఫిర్యాదులో పేర్కొన్నాడు.
చర్చిలో జరిగే ప్రార్థనలు, లౌడ్ స్పీకర్ల శబ్దం వల్ల తీవ్రమైన అసౌకర్యం కలిగిందని, శబ్ద కాలుష్యం కారణంగా చెవి సంబంధిత సమస్యలు, ఉక్కిరిబిక్కిరి అయ్యే పరిస్థితులు ఎదురయ్యాయని విద్యార్థి ఆరోపించాడు. కోర్సు మానేస్తానని డిసెంబర్ 13న ఇమెయిల్ చేయగా, సంస్థ నుండి "ఓకే" అని సమాధానం వచ్చింది కానీ ఫీజు మాత్రం తిరిగి ఇవ్వలేదు. లీగల్ నోటీసు పంపినా స్పందన లేకపోవడంతో అతను వినియోగదారుల కమిషన్ను ఆశ్రయించాడు.
కమిషన్ తీర్పు:
సంస్థ తన వాదనలో ఈ ఆరోపణలను తోసిపుచ్చింది. తమకు 30 ఏళ్ల అనుభవం ఉందని, మౌలిక సదుపాయాలు బాగున్నాయని పేర్కొంది. అయితే, ఒకే గదిలో 300 మంది విద్యార్థులు ఉన్నారని సంస్థే అంగీకరించడాన్ని కమిషన్ గమనించింది. కిక్కిరిసిన తరగతి గదులు, శబ్ద కాలుష్యం విద్యార్థికి అసౌకర్యం కలిగిస్తాయని కమిషన్ అభిప్రాయపడింది. సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం, ఇటువంటి సందర్భాల్లో 'ఫీజు తిరిగి ఇవ్వబడదు' అనే నిబంధనలు చెల్లవని స్పష్టం చేస్తూ విద్యార్థికి అనుకూలంగా తీర్పునిచ్చింది.