ఇకపై గాంధీ ఆసుపత్రిలో రోగితో పాటు ఇద్దరికి మాత్రమే అనుమతి

గాంధీ ఆస్పత్రిలో రోగితో పాటు బంధువులు ఒకరు లేదా ఇద్దరిని మాత్రమే అనుమతిస్తామని గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఎం రాజారావు తెలిపారు.

By అంజి  Published on  27 Feb 2023 7:30 AM GMT
Gandhi Hospital

గాంధీ ఆస్పత్రి

హైదరాబాద్‌ : గాంధీ ఆస్పత్రిలో రోగితో పాటు బంధువులు ఒకరు లేదా ఇద్దరిని మాత్రమే అనుమతిస్తామని గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఎం రాజారావు తెలిపారు. ఒక్కోసారి 6 నుంచి 10 మంది ఆస్పత్రికి వచ్చి గేటు వద్ద ఉన్న సిబ్బందితో వాగ్వాదానికి దిగి దుర్భాషలాడుతున్నారని చెప్పారు. కుటుంబంలో ఎవరైనా ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రికి వస్తే వారి పరిస్థితిని అర్థం చేసుకోవచ్చని, అయితే వైద్యులు రోగిని పరీక్షించి సరైన వాతావరణంలో చికిత్స అందించాలని ఆయన అన్నారు.

ముఖ్యంగా క్రిటికల్ కేర్, ఐసీయూ, పోస్ట్-ఆపరేటివ్ వార్డులు, ఎమర్జెన్సీ వార్డుల్లో రోగులకు తమ వెంట వచ్చే వారి నుంచి ఇన్‌ఫెక్షన్‌ సోకే ప్రమాదం ఉందని, అయితే రోగులతో వచ్చే వారు వినేందుకు సిద్ధంగా లేరన్నారు. ఈ మధ్య కాలంలో కొంత మంది రోగుల బంధువులు సెక్యూరిటీ, పారిశుధ్య కార్మికులపై పలుమార్లు దాడులు చేశారని తెలిపారు. వారిపై చిల్ల‌గూడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు రోగులను కలిసేందుకు అనుమతిస్తున్నట్లు తెలిపారు. భద్రతను కట్టుదిట్టం చేసి ఆసుపత్రికి వచ్చే వారిని గేటు వద్ద క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే లోపలికి అనుమతిస్తున్నామని తెలిపారు.

బయటి నుంచి వచ్చే రోగుల అటెండర్లు.. వార్డులు, పరిసర ప్రాంతాల్లో ఉమ్మివేయకుండా, మరుగుదొడ్లను అపరిశుభ్రంగా మార్చకుండా పరిశుభ్రత కోసం చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. శానిటరీ సిబ్బంది సంఖ్య పెరగడం వల్ల వార్డులు, రెడ్ ఏరియాల పరిశుభ్రత గతంలో కంటే మెరుగుపడిందని చెబుతున్నారు. వాహనాలకు కేటాయించిన స్థలాల్లోనే పార్కింగ్ చేయాలని, నిబంధనలు పాటించాలని వివరించారు. రూల్స్‌ పాటించకపోతే తగిన చర్యలు తీసుకుంటామని వివరించారు.

Next Story