హైదరాబాద్: ఫిల్మ్ నగర్ సమీపంలో విజిలెన్స్ అధికారులుగా నటిస్తూ ఒక గ్యాస్ డెలివరీ బాయ్ను బెదిరించి డబ్బులు వసూలు చేసిన ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నేరానికి పాల్పడిన వారిని 60 ఏళ్ల మహ్మద్ మన్జూర్ హసన్, 46 ఏళ్ల మహ్మద్ తౌఫీక్ (వీరిద్దరూ ఒక వెబ్సైట్లో రిపోర్టర్లుగా పనిచేస్తున్నారు), 29 ఏళ్ల డ్రైవర్ మహ్మద్ తాజ్గా పోలీసులు గుర్తించారు.
పోలీసుల కథనం ప్రకారం.. ఈ ముగ్గురూ కలిసి గ్యాస్ డెలివరీ బాయ్ను అడ్డగించి, అతను గ్యాస్ సిలిండర్లను నల్లబజారులో విక్రయిస్తున్నాడని నిందలు వేశారు. అతని యజమానికి ఫిర్యాదు చేస్తామని, ఉద్యోగం నుండి తీయించేస్తామని భయపెట్టారు. కేసు నుంచి తప్పించుకోవాలంటే ₹2 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో, భయపడిపోయిన బాధితుడు సిలిండర్లు డెలివరీ చేయగా వచ్చిన నగదును వారికి ఇచ్చేశాడు.
అనంతరం ఈ విషయాన్ని బాధితుడు తన యజమానికి తెలపగా, వారు ఫిల్మ్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా నిందితులను గుర్తించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి ₹23,000 నగదును రికవరీ చేశారు. మిగిలిన డబ్బును మరొక వ్యక్తికి ఇచ్చామని నిందితులు విచారణలో వెల్లడించగా, ప్రస్తుతం పరారీలో ఉన్న ఆ నాలుగో వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు.