నేడే 'ఎర్త్ అవర్'.. హైదరాబాద్‌లో రాత్రి 8:30 నుండి 9:30 వరకు లైట్లు ఎందుకు బంద్‌ కానున్నాయి

ర్యావరణ పరిరక్షణ కోసం ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్న అతిపెద్ద ఉద్యమం 'ఎర్త్ అవర్' (Earth Hour)లో భాగం కావాలని హైదరాబాద్ నగరవాసులకు..

By -  అంజి
Published on : 28 March 2026 11:14 AM IST

Earth Hour 2026, GHMC Hyderabad, WWF Environmental Movement, Climate Change Awareness, Global Warming, Sustainable Living, RV Karnan IAS

నేడే 'ఎర్త్ అవర్'.. హైదరాబాద్‌లో రాత్రి 8:30 నుండి 9:30 వరకు లైట్లు ఎందుకు బంద్‌ కానున్నాయి

హైదరాబాద్: పర్యావరణ పరిరక్షణ కోసం ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్న అతిపెద్ద ఉద్యమం 'ఎర్త్ అవర్' (Earth Hour)లో భాగం కావాలని హైదరాబాద్ నగరవాసులకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) పిలుపునిచ్చింది. నేడు (మార్చి 28) రాత్రి 8:30 గంటల నుండి 9:30 గంటల వరకు అనవసరమైన విద్యుత్ దీపాలను ఆపివేసి, భూమి పట్ల మన బాధ్యతను చాటాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్ కోరారు. 2007లో ఆస్ట్రేలియాలోని సిడ్నీలో వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ (WWF) ప్రారంభించిన ఈ ఉద్యమం, ఇప్పుడు 190కి పైగా దేశాలకు విస్తరించింది. 2026 నాటికి ఈ ఉద్యమం 20వ వసంతంలోకి అడుగుపెట్టడం ఒక చారిత్రాత్మక ఘట్టం.

కేవలం ఒక గంట పాటు లైట్లు ఆపివేయడం వల్ల పెద్దగా మార్పు రాదని కొందరు భావించవచ్చు, కానీ కోట్ల మంది ప్రజలు ఒకేసారి ఈ పని చేయడం వల్ల ప్రపంచ దేశాధినేతలకు, కార్పొరేట్ సంస్థలకు పర్యావరణ పరిరక్షణపై ఒక బలమైన సందేశం వెళ్తుంది. గ్లోబల్ వార్మింగ్, ప్రకృతి వనరుల క్షీణత వంటి అంశాలపై చర్చను రేకెత్తించడమే ఈ 'lights out' కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం. కేవలం ఆ ఒక్క గంటకే పరిమితం కాకుండా.. వ్యర్థాలను తగ్గించడం, నీటిని పొదుపు చేయడం, పునరుత్పాదక ఇంధనాన్ని వాడటం వంటి పర్యావరణ అనుకూల అలవాట్లను అలవర్చుకోవాలని ఎర్త్ అవర్ సూచిస్తోంది.

నగరంలోని నివాస సముదాయాలు (RWAs), వాణిజ్య సంస్థలు, పరిశ్రమలు, స్వచ్ఛంద సంస్థలు ఈ కార్యక్రమంలో స్వచ్ఛందంగా పాల్గొనాలని కమిషనర్ విజ్ఞప్తి చేశారు. నగరంలోని ప్రధాన చిహ్నాలు, ప్రభుత్వ కార్యాలయాలు కూడా ఈ గంట పాటు విద్యుత్ దీపాలను ఆపివేయనున్నాయి. "హైదరాబాద్ నగరాభివృద్ధి పర్యావరణ బాధ్యతతో కూడి ఉండాలి. పచ్చని నగరాన్ని నిర్మించేందుకు జీహెచ్‌ఎంసీ కట్టుబడి ఉంది" అని కమిషనర్ పేర్కొన్నారు. నేడు రాత్రి 8:30 గంటలకు మీ ఫోన్ స్క్రీన్లకు దూరంగా ఉండి, స్విచ్‌లు ఆపివేసి, మన భూమి కోసం ఒక గంట సమయాన్ని కేటాయించాలని అధికారులు కోరుతున్నారు.

Next Story