Hyderabad: విమానంలో వృద్ధుడి ప్రాణాలు కాపాడిన వైద్యురాలు.. ఆమె మరెవరో కాదు

ఢిల్లీ నుంచి హైదరాబాద్ విమానాశ్రయానికి వెళ్తున్న ఇండిగో విమానంలో అస్వస్థతకు గురైన 74 ఏళ్ల ప్రయాణికుడిని.. ఆ విమానంలోనే ప్రయాణం చేస్తున్న వైద్యురాలు కాపాడింది.

By అంజి
Published on : 15 April 2025 9:54 AM IST

Doctor saves passenger, Indigo flight to Hyderabad airport

Hyderabad: విమానంలో వృద్ధుడి ప్రాణాలు కాపాడిన వైద్యురాలు.. ఆమె మరెవరో కాదు

హైదరాబాద్: ఢిల్లీ నుంచి హైదరాబాద్ విమానాశ్రయానికి వెళ్తున్న ఇండిగో విమానంలో అస్వస్థతకు గురైన 74 ఏళ్ల ప్రయాణికుడిని.. ఆ విమానంలోనే ప్రయాణం చేస్తున్న వైద్యురాలు కాపాడింది. మల్లారెడ్డి విశ్వ విద్యాపీట్ మేనేజింగ్ డైరెక్టర్, జనరల్ ఫిజీషియన్ అయిన డాక్టర్ ప్రీతి రెడ్డి, వృద్ధ ప్రయాణికుడు అకస్మాత్తుగా 39000 అడుగుల ఎత్తులో తీవ్ర అనారోగ్యానికి గురైనప్పుడు వెంటనే చర్య తీసుకున్నారు. విమానంలో ప్రయాణిస్తున్న వృద్ధ ప్రయాణీకుడికి భయంకరమైన అనారోగ్య లక్షణాలు కనిపించాయి. మగత, లాలాజలం కారడం, మూత్రాశయం నియంత్రణ కోల్పోవడం, స్పందించకపోవడం వంటి లక్షణాలు కనిపించడంతో.. డాక్టర్ ప్రీతి రెడ్డి అతని బలహీనమైన పల్స్, ప్రమాదకరమైన తక్కువ రక్తపోటును త్వరగా అంచనా వేశారు.

ఏమాత్రం సంకోచించకుండా, ఆమె సీపీఆర్‌ చేసి నిమిషాల్లోనే అతన్ని బ్రతికించారు. స్పృహలోకి వచ్చిన తర్వాత, ఆ వ్యక్తి తనకు రక్తపోటు చరిత్ర ఉందని, గతంలో కార్డియాక్ యాంజియోప్లాస్టీ చేయించుకున్నానని వెల్లడించాడు. ఇండిగో విమాన సిబ్బంది హైదరాబాద్ విమానాశ్రయ కమాండ్ సెంటర్‌తో సమన్వయం చేసుకున్నారు. విమానంలోని మెడికల్ కిట్‌ను ఉపయోగించి, డాక్టర్ ప్రీతి రెడ్డి క్రిటికల్ కేర్ అందించగా, ఇండిగో సిబ్బంది హైదరాబాద్ విమానాశ్రయ కమాండ్ సెంటర్‌తో సమన్వయం చేసుకున్నారు.

ల్యాండింగ్ అయిన వెంటనే సహాయం కోసం అంబులెన్స్, వీల్‌చైర్, అత్యవసర వైద్యుడిని ఏర్పాటు చేశారు. డాక్టర్, క్యాబిన్ సిబ్బంది, తోటి ప్రయాణీకుల సహకార ప్రయత్నం వలన ప్రయాణికుడు హైదరాబాద్ విమానాశ్రయానికి చేరుకునే ముందు స్థిరీకరించబడ్డాడు. డాక్టర్ ప్రీతిరెడ్డి వేగవంతమైన ప్రతిస్పందనను ఇండిగో బృందం, ప్రయాణీకులు ప్రశంసించారు. అయితే ఈ డాక్టర్‌ మరెవరో కాదు.. మేడ్చల్‌ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి కోడలు.

Next Story