ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్టు అయిన అరుణ్ పిళ్ళై.. ఎవరాయన..?

ఢిల్లీ మ‌ద్యం కుంభ‌కోణం కేసులో మ‌రో అరెస్ట్ జ‌రిగింది. హైదరాబాదీ వ్యాపారవేత్త అరుణ్ పిళ్లైని అరెస్ట్ చేశారు.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  7 March 2023 7:13 AM GMT
Arun Ramachandra Pillai, ED

Arun Ramachandra Pillai

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మరో అరెస్టు జరిగింది. ఇప్పటికే ఈ కేసులో పది మంది అరెస్టు కాగా తాజాగా మరొకరిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. హైదరాబాదీ వ్యాపారవేత్త అరుణ్ పిళ్లైని సోమవారం విచారించిన ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు, రాత్రి పదకొండు గంటలకు ఆయనను అరెస్టు చేశారు. ఈ కేసులో అరెస్టయిన వారి సంఖ్య 11 కు చేరింది. మనీష్ సిసోడియా అరెస్టు తర్వాత అరుణ్ పిళ్ళై పేరును ఎఫ్ఐఆర్ లో చేర్చారు. ఇప్పుడు అరెస్టు చేశారు.

ఎవరీ అరుణ్ పిళ్ళై?

ఢిల్లీ ఎక్సైజ్ శాఖలోని ప్రభుత్వ ఉన్నతాధికారులతో సహా 17 మంది సభ్యులపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఆ సమయంలో అరుణ్ రామచంద్ర పిళ్లై పేరు బయటకు వచ్చింది. సిబిఐవిచారణ ప్రారంభించి హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో, పలు మార్లు సోదాలు నిర్వహించింది. ఆ తర్వాత బోయిన్ పల్లి అభిషేక్ రావును కూడా అదుపులోకి తీసుకున్నారు. అభిషేక్ రావు ఓ టీఆర్ఎస్ అగ్రనేతకి అత్యంత నమ్మకస్తుడు. ఢిల్లీ మద్యం పాలసీ స్కామ్‌లో సహ నిందితుడు అరుణ్ రామచంద్ర పిళ్లైకి వ్యాపార భాగస్వామి కూడా. అభిషేక్, అరుణ్ జులై 2022లో స్థాపించిన రాబిన్ డిస్ట్రిబ్యూషన్ ఎల్‌ఎల్‌పి కంపెనీకి సహ-డైరెక్టర్‌లు. ఇది కేవలం పేపర్‌పై మాత్రమే ఉన్న డొల్ల కంపెనీ అని పరిశోధనలో తేలింది.

సీబీఐ కేసు నమోదు చేసిన 17 మందిలో హైదరాబాద్‌లోని కోకాపేట నివాసి అరుణ్‌ కూడా ఉన్నారు. అతను ఇండో స్పిరిట్‌కు చెందిన సమీర్ మహేంద్రు (సహ నిందితుడు) నుండి అనవసరమైన డబ్బు సేకరించి, విజయ్ నాయర్ ద్వారా ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రభుత్వోద్యోగికి ఇచ్చారని అధికారులు నివేదించారు. అభిషేక్ (అనూస్ బ్యూటీ పార్లర్‌లోని సోదరీమణులలో ఒకరి కుమారుడు) అనేక మంది మద్యం వ్యాపారుల కోసం లాబీయింగ్ చేస్తున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. “సమీర్ మహేంద్రు తో అనుబంధం గురించి అభిషేక్‌ను ప్రశ్నించారు. అభిషేక్‌రావు దక్షిణాది లాబీగా వ్యవహరిస్తున్నారని, కార్టలైజేషన్‌ ద్వారా అక్రమాలకు పాల్పడ్డారని సీబీఐ విచారణలో తేలింది. అతను రూ.3.85 కోట్లు సమీర్ నుండి తీసుకున్నాడు.. అయితే అది తాను అప్పుగా తీసుకున్నట్లు పేర్కొన్నాడు, ”అని మూలాలు NewsMeter కి తెలిపాయి. సమీర్ మహేంద్రుడి నుండి అభిషేక్ 3.85 కోట్లు వసూలు చేసినట్లు విచారణలో తేలింది. ప్రభుత్వ అధికారులకు "కమీషన్" చెల్లించడానికి ఆ డబ్బును వాడారు.

అటాచ్ చేసిన ఆస్తి:

ఢిల్లీ మద్యం కుంభకోణంలో నలుగురు నిందితుల్లో 76.54 కోట్ల రూపాయల ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అటాచ్ చేసింది. అటాచ్ చేసిన ఆస్తుల్లో నిందితుడు అరుణ్ రామచంద్ర పిళ్లైకి చెందిన హైదరాబాద్‌లోని 2.25 కోట్ల విలువైన భూమి ఉంది. డైరెక్టరేట్ ఆఫ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ED) తాత్కాలికంగా 76.54 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసింది, ఇందులో సమీర్ మహంద్రు, శ్రీమతి గీతికా మహేంద్రుకు సంబంధించిన జోర్ బాగ్, న్యూఢిల్లీలో 35 కోట్ల విలువైన నివాస ఆస్తులు ఉన్నాయి; అమిత్ అరోరాకు చెందిన గురుగ్రామ్‌లోని మాగ్నోలియాస్‌లో 7.68 కోట్ల నివాస ప్రాంతం, విజయ్ నాయర్‌కు చెందిన ముంబైలోని పరేల్‌లోని క్రెసెంట్ బేలో 1.77 కోట్ల నివాస ప్రాంగణం, దినేష్ అరోరాకు చెందిన రెస్టారెంట్లు 'చికా', 'లా రోకా', 'అన్‌ప్లగ్డ్ కోర్ట్‌యార్డ్' ఆస్తులు 3.18 కోట్లు, అరుణ్ పిళ్లైకి చెందిన వట్టి నాగుల పల్లె హైదరాబాద్‌లో 2.25 కోట్ల విలువైన భూమి, ఇండోస్పిరిట్ గ్రూప్‌కు చెందిన 10.23 కోట్ల విలువైన 50 వాహనాలు, 14.39 కోట్ల విలువైన బ్యాంక్ బ్యాలెన్స్/ఫిక్స్‌డ్ డిపాజిట్లు/ఫైనాన్షియల్ ఇన్‌స్ట్రుమెంట్‌లు ఉన్నాయి.

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ 2021-22 రూపకల్పన, అమలులో అవినీతి, కుట్రల కారణంగా ప్రభుత్వ ఖజానాకు కనీసం 2873 కోట్ల నష్టం వాటిల్లిందని ED దర్యాప్తులో వెల్లడైంది. PC చట్టం, 2018లోని సెక్షన్ 7 మరియు IPC 120 B కింద షెడ్యూల్ చేసిన నేరానికి సంబంధించిన కార్యకలాపాల ద్వారా 76.54 కోట్ల డబ్బును ట్రేస్ చేశారు.

ఈ రోజు వరకు, ఢిల్లీ, హైదరాబాద్, చెన్నై, ముంబై, ఇతర ప్రదేశాలతో సహా దేశవ్యాప్తంగా అనేక ప్రదేశాలను ED శోధించింది. వివిధ వ్యక్తులను విచారించిన తరువాత స్వాధీనం చేసుకున్న రికార్డుల తర్వాత.. విజయ్ నాయర్, సమీర్ మహంద్రు, అమిత్ అరోరా, శరత్ రెడ్డి, బెనోయ్ బాబు, అభిషేక్ బోయిన్‌పల్లి అనే ఆరుగురు నిందితులను అరెస్టు చేశారు. ప్రస్తుతం అందరూ జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. ప్రస్తుతం 11 మందిని ఈ కేసులో అరెస్ట్ చేశారు.

Next Story