బార్‌కోడ్ టిక్కెట్‌లు, కలర్-కోడెడ్ రిస్ట్‌బ్యాండ్‌లు.. భార‌త్‌, కివీస్ మ్యాచ్‌పై అజారుద్దీన్

Azharuddin interview Barcoded tickets, color-coded wristbands for India - NZ ODI.మహ్మద్ అజారుద్దీన్ మ‌రికొద్ది రోజుల్లో

By తోట‌ వంశీ కుమార్‌  Published on  12 Jan 2023 6:30 AM GMT
బార్‌కోడ్ టిక్కెట్‌లు, కలర్-కోడెడ్ రిస్ట్‌బ్యాండ్‌లు.. భార‌త్‌, కివీస్ మ్యాచ్‌పై అజారుద్దీన్

భార‌త దిగ్గ‌జ ఆట‌గాడు మహ్మద్ అజారుద్దీన్ మ‌రికొద్ది రోజుల్లో 60వ పుట్టిన రోజును జ‌రుపుకోనున్నాడు. ఈలోగా ఉప్ప‌ల్‌లోని రాజీవ్‌గాంధీ అంత‌ర్జాతీయ స్టేడియంలో జ‌న‌వ‌రి 18న భార‌త్‌, న్యూజిలాండ్ జ‌ట్ల మ‌ధ్య జ‌ర‌గ‌నున్న తొలి వ‌న్డే మ్యాచ్‌కు సంబంధించిన స‌వాల్‌తో కూడిన ప‌నిని ఆస్వాదిస్తున్నాడు. ప్రేక్ష‌కుల‌కు మంచి అనుభూతిని అందించేందుకు అజారుద్దీన్ మరియు అతని బృందం మ్యాచ్ ఏర్పాట్ల‌లో మునిగిపోయింది. ఈ క్ర‌మంలో మ్యాచ్ ఏర్పాట్ల‌పై అజారుద్దీన్ మాట్లాడారు.

భారత్, న్యూజిలాండ్ తొలి వన్డే కోసం ఉప్ప‌ల్‌లో ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు?

నాలుగేళ్ల విరామం తర్వాత హైదరాబాద్ వన్డేకు ఆతిథ్యం ఇస్తున్న నేపథ్యంలో ఈ వన్డే మాకు చాలా ముఖ్యం. మేము అనేక టాస్క్ ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేసాము. అవి ఏర్పాట్లను చూస్తాయి అంతేకాకుండా వివిధ విక్రేతలతో సమన్వయం చేస్తాయి. ఈ మ్యాచ్ ప్రజలకు గుర్తుండిపోయేలా చేయడమే మా ప్రాధాన్యత. ఇక ప్రేక్ష‌కులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మైదానంలోకి ప్ర‌వేశించేందుకు బార్‌కోడ్ టిక్కెట్‌లు, కలర్-కోడెడ్ రిస్ట్‌బ్యాండ్‌లు అందిస్తున్నాం. మ్యాచ్‌కు రెండు గంట‌ల ముందు నుంచి ప్రేక్ష‌కుల‌ను లోనికి అనుమ‌తి ఇస్తాం.

మ్యాచ్ రోజు ఎలాంటి భద్రతా ఏర్పాట్లు చేశారు?

మేము అంతర్గత బృందాలను ఏర్పాటు చేసాము. రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు, షీ బృందాలు మరియు భద్రతా బృందాలతో సమన్వయం చేస్తున్నాము. ఎలాంటి దుర్ఘటనలు జరగకూడదనుకుంటున్నాం. ప్రజలకు చిన్నపాటి చెడు అనుభవం కూడా ఉండకూడదని మేము కోరుకుంటున్నాము. అన్ని ఏర్పాట్లను నిశితంగా పరిశీలిస్తున్నారు. రద్దీని నివారించడానికి బారికేడ్లు ఏర్పాటు చేసి క్యూలో లోప‌లికి పంపుతాం. మ్యాచ్ అనంత‌రం టీమ్‌లు, పబ్లిక్‌తో సహా ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓ స‌రికొత్త అనుభవాన్ని తీసుకువెళ్లాల‌నేదానిపై దృష్టి సారించాం.

టిక్కెట్లు ఎలా అమ్ముతారు?

నాలుగు రోజుల పాటు బ్యాచ్‌ల వారీగా టిక్కెట్లు విక్రయించబడతాయి. జనవరి 13న 6000 టిక్కెట్లు, జనవరి 14 మరియు 15 తేదీల్లో 7000 చొప్పున టిక్కెట్లు అమ్మకానికి అందుబాటులో ఉంటాయి. మిగిలిన టిక్కెట్లు జనవరి 16న Paytm ద్వారా విక్రయించబడతాయి. ఈసారి ఆన్‌లైన్ విధానంలో మాత్రమే టిక్కెట్లను విక్రయించనున్నారు. టిక్కెట్ల బ్లాక్ మార్కెటింగ్‌ను నివారించేందుకు హెచ్‌సీఏ ప్రచారం నిర్వహిస్తోంది.

టిక్కెట్ల విక్రయం జనవరి 13 సాయంత్రం 5 గంటలకు ప్రారంభమవుతుంది. ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసిన టిక్కెట్ ల భౌతిక కాపీలు గచ్చిబౌలిలోని లాల్ బహదూర్ శాస్త్రి స్టేడియం, GMC బాలయోగి స్టేడియంలోని కేంద్రాల్లో అందిస్తాం. ఈ కౌంటర్లు జనవరి 15 నుంచి ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు తెరిచి ఉంటాయి.

గత ఏడాది సెప్టెంబరులో భార‌త్‌, ఆస్ట్రేలియా జ‌ట్ల మ‌ధ్య జ‌రిగిన టీ20 మ్యాచ్ టికెట్ల కోసం అభిమానులు ఘ‌ర్ష‌ణ‌లు ప‌డ‌గా, వారిని చెద‌ర‌గొట్ట‌డానికి పోలీసులు లారీ ఛార్జ్ చేయ‌వ‌ల‌సి వ‌చ్చింది. అలాంటి ఘ‌ట‌న మ‌రొసారి జ‌ర‌గ‌కుండా ఉండేందుకు చ‌ర్య‌లు తీసుకున్నాం. ఇండియా, న్యూజిలాండ్ జ‌ట్ల మ‌ధ్య మ్యాచ్‌కు సంబంధించి ప‌టిష్ట చ‌ర్య‌లు తీసుకున్నాం. అని అజారుద్దీన్ తెలిపారు.

ఇదిలా ఉంటే.. క్రికెట్ అభిమానులు తమ అభిమాన క్రికెట‌ర్ల‌ల‌ను స్టాండ్స్ నుండి ప్రత్యక్షంగా చూడటానికి తహతహలాడుతున్నారు. భారత్, న్యూజిలాండ్ జట్లు ఇప్పటి వరకు 116 వ‌న్డే మ్యాచ్‌లు ఆడగా అందులో భారత్ 55 గెలిచింది. న్యూజిలాండ్ క్రికెట్ జట్టు శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌కు చేరుకుంటుంది. ఆ తర్వాత శనివారం భారత క్రికెట్ జట్టు రానుంది. ఆటకు ఒకరోజు ముందు జనవరి 17న న్యూజిలాండ్ జ‌ట్టుకు మధ్యాహ్నం 1 నుంచి సాయంత్రం 4 గంటల వరకు, భారత జట్టుకు సాయంత్రం 5 నుంచి రాత్రి 8 గంటల వరకు ప్రాక్టీస్ మ్యాచ్‌లు జరుగుతాయి.

Next Story