జూన్‌ 8 నుంచి హోటళ్లు, రెస్టారెంట్లు ప్రారంభం.. ప్రభుత్వం కీలక నిర్ణయం

By సుభాష్  Published on  4 Jun 2020 11:05 AM GMT
జూన్‌ 8 నుంచి హోటళ్లు, రెస్టారెంట్లు ప్రారంభం.. ప్రభుత్వం కీలక నిర్ణయం

ఏపీ: దేశంలో కరోనా పాజిటివ్‌ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. దీంతో రెండు నెలలకుపైగా లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. ఇక ఐదోదశ లాక్‌డౌన్‌లో కేంద్ర ప్రభుత్వం చాలా వరకూ లాక్‌డౌన్‌ నుంచి సడలింపులు ఇచ్చింది. ఈనెల 8వ తేదీ నుంచి సడలింపులు ఉంటాయని మార్గదర్శకాలను విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే కేంద్ర మార్గదర్శకాల ప్రకారం.. జూన్‌ 8 నుంచి ఏపీ రాష్ట్రంలో హోటళ్లు, రెస్టారెంట్లు ప్రారంభించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు మంత్రులు అవంతి శ్రీనివాస్‌, వెల్లంపల్లి శ్రీనివాస్‌ హోటళ్ల యజమానులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి అవతి శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. 8వ తేదీ నుంచి రాష్ట్రంలో హోటళ్లు, రెస్టారెంట్లు ప్రారంభించవచ్చని, ఏపీలో అతిపెద్ద కోస్తాతీరం, సుందర నదులు, టూరిస్ట్‌ స్థలాలు చాలా ఉన్నాయని, అన్ని చోట్ల హోటళ్లు తెరుచుకునేందుకు అనుమతులు ఇస్తున్నామని అన్నారు.

టూరిస్ట్‌లు, యాత్రీకుల వసతి కోసం హోటళ్లు నిర్వహిస్తూనే కోవిడ్‌ నివారణ చర్యలు, నిబంధనలు తప్పకుండా పాటించాలని అన్నారు. దాదాపు ప్రతి జిల్లాలోనూ టూరిజం ప్రమోషన్లో భాగంగా వివిధ పండగలు, పర్యాటక రంగం ద్వారా ఆదాయాన్ని ఏ విధంగా సమకూర్చుకోవాలనే అంశంపై కసరత్తు చేస్తున్నామన్నారు. లాక్‌డౌన్‌ కారణంగా నెలకు రూ. 10 కోట్ల వరకూ ఆదాయాన్ని కోల్పోయినట్లు చెప్పారు. త్వరలో కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌లను కూడా ప్రారంభిస్తున్నట్లు చెప్పారు.

Next Story