కామారెడ్డి జిల్లాలో.. 1వ శతాబ్దపు బౌద్ధ భిక్షువు గిన్నె లభ్యం

1st century stone bowl sheds light on Buddhist influence in Kamareddy district. శాతవాహనుల కాలంలో తెలంగాణలోని మంజీరా నదీ లోయలో బౌద్ధుల ప్రభావం ఎక్కువగా ఉందని ఇప్పటికే నిరూపితమైంది.

By అంజి  Published on  30 Oct 2022 11:45 AM GMT
కామారెడ్డి జిల్లాలో.. 1వ శతాబ్దపు బౌద్ధ భిక్షువు గిన్నె లభ్యం

శాతవాహనుల కాలంలో తెలంగాణలోని మంజీరా నదీ లోయలో బౌద్ధుల ప్రభావం ఎక్కువగా ఉందని ఇప్పటికే నిరూపితమైంది. అయితే దానికి సాక్ష్యంగా మరో అద్భుతం బయటపడింది. పరిశోధకులు 1వ శతాబ్దానికి చెందిన ఒక రాతి గిన్నెను కనుగొన్నారు. ఇందులో ప్రాకృత భాషలో ఒక చిన్న శాసనం ఉంది. ఇది హిమ అనే బౌద్ధ భిక్కుని (సన్యాసిని)కి చెందినది కావచ్చు. డాక్టర్ ఎంఏ శ్రీనివాసన్ (పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో పురావస్తు శాస్త్రవేత్త మరియు అసిస్టెంట్ ప్రొఫెసర్), బి శంకర్ రెడ్డి మరియు సిహెచ్ నివేదిత శాలినిలతో కూడిన బృందం కామారెడ్డి జిల్లా బాన్సువాడకు 5 కిమీ దూరంలో ఉన్న బోర్లాం గ్రామంలోని మట్టిదిబ్బపై గిన్నెను కనుగొన్నారు. బిచుకుందలోని కవి మడివాళ్లయ్య మఠానికి చెందిన ఆది బసవేశ్వర దేవస్థానం పక్కనే ఈ గ్రామం ఉంది. ఈ పరిశోధన మఠాధిపతి సోమాయప్ప సహకారంతో సాధ్యమైందని ప్రిహా పేర్కొంటున్నది.

శాసనం ప్రాకృత భాషలో, బ్రాహ్మీ లిపిలో వ్రాయబడింది. రాతి గిన్నెపై ఐదు బ్రాహ్మీ వర్ణమాలలు ఉన్నాయి. ఈ శాసనం 'హిమబుహియా' లేదా 'హిమబుధియా' అనే బౌద్ధ బిక్షుని (స్త్రీ లేదా మగ)ది కావచ్చని ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా డాక్టర్ మునిరత్నం రెడ్డి అంటున్నారు. ''మంజీరా లోయలో లభించిన ఆరవ బ్రాహ్మీ లేబుల్ శాసనం ఇది. లోయలో లభించిన ఈ లేబుల్ శాసనాలన్నీ మౌర్యులు, శాతవాహనుల కాలానికి చెందినవి. తెలంగాణ తొలి చరిత్రను, ముఖ్యంగా శాతవాహనుల కాలాన్ని పునర్నిర్మించడంలో సాక్ష్యాలను సుసంపన్నం చేస్తాయి.'' అని పబ్లిక్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎంఎ శ్రీనివాసన్ చెప్పారు. గతంలో ప్రిహా పరిశోధకులు కామారెడ్డి జిల్లా మాల్తుమ్మెడ వద్ద ఒక బ్రాహ్మీ శాసనం, మెదక్ జిల్లా ఏడుపాయల సమీపంలో అలాంటి నాలుగు శాసనాలు కనుగొన్నారు.

Next Story