అప్పుడే డ్రగ్స్కు బానిసయ్యాను..
By అంజి
బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్.. డేర్ అండ్ డాషింగ్ గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె ఏదైనా ముక్కుసూటిగానే మాట్లాడేస్తుంటుంది. కాంట్రవర్సీలో కూడా కంగనా పేరు ముందు వరుసలోనే ఉంటుంది. వివాదాస్పద విషయాల్లో.. తన ఘాటైన వ్యాఖ్యలతో ఫైర్ బ్రాండ్ కంగనా ఎప్పుడూ వార్తల్లో నానుతూనే ఉంటుంది. తాజాగా లాక్డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన కంగనా.. తన చిన్న నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటోంది. అలా తన జీవితంలో మంచి, చెడు అనుభవాలను నెమరువేసుకుంటోంది. తన జీవితంలో జరిగిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఇన్స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకుంది. ఆమె వీడియోల మాట్లాడుతూ.. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంట్లో ఉండటాన్ని బోర్గా ఫీల్ అవ్వొద్దని చెప్పింది. పలు సందర్భాల్లో చెడ్డ రోజులే మంచి రోజులుగా మారుతాయని చెప్పుకొచ్చింది. 'అప్పుడు నాకు 15 సంవత్సరాలు ఉంటాయి.. అప్పుడే ఇంటి నుంచి పారిపోయాను. ఆ తర్వాత రెండు సంవత్సరాలకే సినిమా స్టార్ను అయ్యాను. అదే సమయంలో తాను డ్రగ్స్కు బానిస అయ్యానని, జీవితం గందరగోళంగా మారిందని.. కొంతమంది మంచి వ్యక్తుల వల్ల డ్రగ్స్ వాడడం ఆపేశాను. ఇదంతా యుక్త వయసులో జరిగింది. ఇదే సమయంలో ఒక మంచి ఫ్రెండ్ నా జీవితంలోకి ఎంట్రీ ఇచ్చింది. అలా ఆధ్యాత్మికత వైపు నడిచానని' కంగనా రనౌత్ చెప్పుకొచ్చింది.
2009లో వచ్చిన ఏక్ నిరంజన్ సినిమాలో రెబల్ స్టార్ ప్రభాస్ సరసన కంగనా రనౌత్ నటించింది. ఆ సినిమా పెద్దగా ఆకట్టుకోకపోవడంతో కంగనాకు తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదు. ప్రస్తుతం కంగనా ప్రతిష్టాత్మక సినిమా తలైవిలో నటిస్తున్నారు. తమిళనాడు మాజీ సీఎం జయలలిత నిజ జీవితం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.