ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త.. సమ్మెకాలపు జీతాలు విడుదల..
By Newsmeter.Network
తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు సీఎం కేసీఆర్ శుభవార్తను అందించారు. గత ఏడాది తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు చేపట్టిన సమ్మె కాలపు జీతాలను విడుదల చేశారు. ఈ మేరకు దీనికి సంబంధించి రూ. 235 కోట్లను విడుదల చేస్తూ ఆర్థికశాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. గత ఏడాది ఆర్టీసీ ఉద్యోగులు 52రోజుల పాటు సమ్మె చేసిన సంగతి తెలిసిందే. తమ 26 డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఆర్టీసీ కార్మికులు అన్ని డిపోల్లో విధులు బహిష్కరించి ర్యాలీలు, ధర్నాలు చేపట్టారు.
వీరికి అఖిలపక్షం నేతలు, పలు యూనియన్ సంఘాలు మద్దతుగా నిలిచాయి. ఎట్టకేలకు సమ్మెను ముగించిన కార్మికులు.. అప్పట్లో సమ్మె కాలంలో తమకు జీతాలు ఇవ్వాలని సీఎం కేసీఆర్ను కోరారు. సమ్మెకాలపు జీతాలను కూడా చెల్లిస్తామని సీఎం కేసీఆర్ సైతం హామీ ఇచ్చారు. ఇందులో భాగంగా బుధవారం నిధులు విడుదల చేస్తూ జీవో జారీ చేశారు.
ఉద్యోగుల సమ్మె సమయంలో కేసీఆర్ కాస్త కటువుగానే ఉన్నా.. సమ్మె విరమణ తరువాత ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికుల సమస్యలపై కేసీఆర్ ఎప్పటికప్పుడు స్పందిస్తూ వారికి ఇబ్బందులు తెలెత్తకుండా చర్యలు తీసుకున్నారు. ఇదిలా ఉంటే 2020- 21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆర్టీసీకి.. ప్రభుత్వం బడ్జెట్లో రూ. వెయ్యి కోట్లు కేటాయించింది. ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు 60ఏళ్లకు పొడిగిస్తూ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. దీనికితోడు ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికై బోర్డు ఏర్పాటు చేస్తామని అసెంబ్లీలో సీఎం కేసీఆర్ వెల్లడించారు.