వామ్మో బంగారం.. రూ.11వేలు పెరిగింది.. కొనాలంటే చుక్క‌లే..

By తోట‌ వంశీ కుమార్‌  Published on  7 April 2020 7:49 AM GMT
వామ్మో బంగారం.. రూ.11వేలు పెరిగింది.. కొనాలంటే చుక్క‌లే..

బంగారం కొనాలంటే చుక్క‌లు క‌నిపిస్తున్నాయి. ధ‌ర రోజు రోజుకు ప‌రిగెడుతూ చుక్క‌ల‌ను అంటుతోంది. క‌రోనా వైర‌స్ ప్ర‌భావంతో మార్చి నెల‌ ప్రారంభంలో కొంత త‌గ్గినా.. మార్చి నెల చివ‌రికి భారీగా పెరిగింది. ప‌సిడి కొనేవారికి చుక్క‌లు చూపిస్తున్నా.. ఇన్వెస్ట్ చేసిన వారు మాత్రం లాభాలు పొందుతున్నారు. బంగారం ధర గ‌త ఆర్థిక సంవ‌త్స‌రంతో పోలీస్తే భారీగా పెరిగింది. 10 గ్రాములకు ఏకంగా రూ.11,000 ర్యాలీ చేసింది. దీంతో బంగారంలో ఇన్వెస్ట్ చేసిన వారికి అదిరిపోయే లాభం వ‌చ్చింది.

బంగారం ధర 2019 మార్చి 31న రూ.32 వేల వద్ద క్లోజ్ అయ్యింది. ఇప్పుడు 2020 మార్చి 31న బంగారం ధర 43వేల‌ వద్ద ముగిసింది. అంటే రూ.11వేలు పెరిగింద‌న్న మాట‌. దీంతో ఇన్వెస్ట్ చేసిన వారు భారీగా లాభాలు పొందారు.

క‌రోనా భ‌యంతో.. మార్చి నెలలో బంగారం ధర రూ.38,500 స్థాయికి ప‌డిపోయింది. దీంతో మ‌ళ్లీ 35వేల‌కు దిగువ‌కు వ‌స్తుంద‌ని స‌గ‌టు వినియోగ‌దారుడు ఆశ‌ప‌డ్డాడు. కానీ నెల చివ‌ర‌కి వ‌చ్చే స‌రికి బంగారం ధర రూ.43 వేల వద్ద ముగిసింది. స్టాక్ మార్కెట్ పతనం, రూపాయి బలహీనపడటం వంటి అంశాలు కూడా పసిడి పరుగుకు దోహదపడ్డాయని కేడియా అడ్వైజరీ డైరెక్టర్ అజయ్ కేడియా తెలిపారు.ఇదిలా ఉంటే.. ఏప్రిల్ నెలలో పసిడి ధర 10 గ్రాములకు రూ.45,000 మార్క్ పైకి చేరొచ్చని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు.

బంగారం ధరపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి.

Next Story