ఏపీ సీఎం జగన్‌తో జర్మన్‌ కాన్సులేట్‌ జనరల్‌ భేటీ

By అంజి  Published on  9 March 2020 10:57 AM GMT
ఏపీ సీఎం జగన్‌తో జర్మన్‌ కాన్సులేట్‌ జనరల్‌ భేటీ

అమరావతి: రాష్ట్ర సీఎం వైఎస్‌ జగన్‌తో జర్మనీ కాన్సులేట్‌ జనరల్‌ కేరిన్‌ స్టోల్‌ భేటీ అయ్యారు. తాడేపల్లిలోని తన నివాసంలో కేరిన్‌ స్టోల్‌ బృందాన్ని సీఎం జగన్‌ సాదరంగా ఆహ్వానించారు. ఆమెకు శాలువా కప్పి జగన్‌ సన్మానించారు. ఇద్దరూ పలు అంశాలపై చర్చించుకున్నారు. విద్యావ్యవస్థ, మహిళ సంక్షేమం, రైత భరోసా కేంద్రాల గురించి సీఎం జగన్‌.. కేరిన్‌ స్టోల్‌కు వివరించారు. జర్మన్‌ విద్యా వ్యవస్థ గురించి జగన్‌ అడిగి తెలుసుకున్నారు.

చెన్నెలోని కౌన్సులేట్ జనరల్ ఆఫ్ ఫెడరల్ రిపబ్లిక్ ఆఫ్ జర్మనీకి చెందిన కౌన్సల్ జనరల్ కేరిన్ స్టోల్ సోమవారం అమరావతి సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ప్రాథమిక రంగంలో జర్మనీ దేశం తరుపున వివిధ కంపెనీలు పెట్టుబడులు పెట్టే అంశంపై ఆమె సీఎస్‌తో చర్చించారు. అదే విధంగా విద్యా, సాంస్కృతిక మరియు పర్యాటక రంగాలతోపాటు ఆంధ్రప్రదేశ్‌లో పనిచేస్తున్న జర్మనీ కంపెనీలకు సంబంధించిన వివిధ ద్వైపాక్షిక సహకార అంశాలపై సమావేశంలో చర్చించారు.

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని మాట్లాడుతూ... రాష్ట్రంలో విద్యా, వైద్య రంగాల్లో మెరుగైన మౌళిక సదుపాయల కల్పనకు ముఖ్యమంత్రి అత్యంత ప్రాధాన్యతనిస్తున్నారని ఆమె జర్మన్ కౌన్సల్ జనరల్ కేరిన్ స్టోల్ దృష్టికి తెచ్చారు.

ఈ కార్యక్రమంలో హైదరాబాద్‌లోని ఫెడరల్ రిపబ్లిక్ ఆఫ్ జర్మనీ హానరరీ కౌన్సల్ బివిఆర్ మోహన్ రెడ్డి, రాష్ట్ర ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.ఎస్.రావత్ తదితరులు పాల్గొన్నారు.

Next Story