బీసీసీఐ అధ్యక్షుడు గంగూలి ఇంట్లో కరోనా కలవరం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  20 Jun 2020 10:44 AM GMT
బీసీసీఐ అధ్యక్షుడు గంగూలి ఇంట్లో కరోనా కలవరం

బీసీసీఐ అధ్యక్షుడ, భారత జట్టు మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలి ఇంట కరోనా కలకలం రేపంది. తాజాగా దాదా కుటుంబ సభ్యుల్లో మరో ఇద్దరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. గంగూలి అన్న, మాజీ రంజీ క్రికెటర్‌ స్నేహశీష్‌ తో పాటు అతని భార్యకు కరోనా పాజిటివ్‌ గా తేలింది. స్నేహశీష్‌తో పాటు అతడి ఇంట్లో పనిచేసే వ్యక్తికి తో పాటు అతడి అత్త మామలకు కూడా కరోనా సోకింది. దీంతో వారు ఓ ప్రైవేట్‌ నర్సింగ్‌ హోమ్‌కు తరలించి చికిత్స తీసుకుంటున్నారు.

బెంగాల్‌కు చెందిన ఒక సీనియర్ అధికారి మీడియాతో మాట్లాడుతూ.. ఆ నలుగురు తమకు అనారోగ్య సమస్యలు ఉన్నాయని ఫిర్యాదు చేశారు. టెస్టుల్లో వారికి పాజిటివ్‌ అని వచ్చింది. కాగా.. వారిని ఎప్పుడు డిశ్చార్జి చేయాలనేది వారు చికిత్సకు ఎలా స్పందిస్తున్నారనే దానిపై ఆధారపడి ఉంటుందని అన్నారు. అయితే.. వారు గంగూలి నివసిస్తున్న ఇంట్లో ఉండడం లేదన్నారు. పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది గతవారం కరోనా వైరస్‌ బారిన పడిన విషయం తెలిసిందే. తాను మహమ్మారి నుంచి కోలుకుంటున్నట్లు తాజాగా అఫ్రిది తెలిపాడు. అసత్య వార్తలను నమ్మవద్దని, తన గురించి భయపడాల్సిన అవసరంలేదని అభిమానులకు విజ్ఞప్తి చేశాడు.

భారత్‌లో వేగంగా కరోనా మహమ్మారి వ్యాప్తి చెందుతోంది. లాక్‌డౌన్‌ సడలింపులు ఇవ్వడంతో రికార్డు స్థాయిలో కేసులు నమోదు అవుతున్నాయి. ఇప్పటి వరకు దేశంలో 3,95,048కి కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. మొత్తం నమోదు అయిన కేసుల్లో 2,13,831 మంది కోలుకుని డిశ్చార్జి కాగా.. 1,68,269 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ మహమ్మారి భారీన పడి 12,948 మంది మృత్యువాత పడ్డారు. ప్రపంచంలో అత్యధిక కేసులు నమోదు అవుతున్న దేశాల్లో భారత్‌ 4వ స్థానంలో కొనసాగుతుండగా.. అత్యధిక మరణాలు నమోదు అవుతున్న దేశాల్లో ఎనిమిద స్థానంలో ఉంది

ఇక పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలో ఇప్పటి వరకు 13,090 కేసులు నమోదు కాగా. 529 మంది ప్రాణాలు కోల్పోయారు.

Next Story