'నయీమ్‌' కేసులో మరో కీలక మలుపు

By Newsmeter.Network  Published on  27 Nov 2019 12:24 PM GMT
నయీమ్‌ కేసులో మరో కీలక మలుపు

ముఖ్యాంశాలు

  • బినామీ పేరిట పెద్ద ఎత్తున ఆస్తులు
  • నయీమ్‌ భార్య స్టేట్‌మెంట్‌ రికార్డు
  • ఇన్ కామ్ ట్యాక్స్ కు చేరిన నయీమ్ ఆస్తుల కేసు

తెలుగు రాష్ట్రాల్లో ఒక ఊపు ఊపిన గ్యాంగ్‌స్టర్ నయీమ్ కేసు మరో కీలక మలుపు తిరిగింది. నయీమ్‌కు సంబంధించిన ఆస్తుల కేసు ఇన్‌కామ్‌ ట్యాక్స్‌ శాఖకు చేరుకుంది. ఈ సందర్భంగా నయీమ్‌కు సంబంధించిన ఆస్తుల వివరాలు పూర్తిగా అందించాలని పోలీసును ఐటీ శాఖ అధికారులు కోరారు. నయీమ్ భార్య హసీనా బేగంను ఐటీ అధికారులు విచారించారు. బుధవారం జరిగిన ఈ విచారణలో హసీనా ఆస్తులకు సంబంధించిన పూర్తి వివరాలు అందించినట్లు తెలుస్తోంది. తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లా షాద్ నగర్ వద్ద మిలినియం టౌన్ షిప్‌లో తలదాచుకున్న నయీమ్ ను 2016, ఆగస్టు 8న పోలీసుల ఎన్ కౌంటర్‌లో హతమైన విషయం తెలిసిందే. అనంతరం అతడికి సంబంధించిన ఇళ్లు, ఇతర ప్రాంతాల్లో సోదాలు చేయగా..పెద్ద ఎత్తున ఆస్తిపత్రాలు లభ్యమయ్యాయి. గుట్టలు గుట్టలుగా నోట్ల కట్టలను స్వాధీనం చేసుకున్నట్లు అప్పట్లో ప్రచారం జరిగింది.

ఈ సందర్భంగా ఐటీ శాఖ అధికారులు హసీనా స్టేట్ మెంట్ రికార్డు చేశారు. నయీం ఎన్ కౌంటర్ అనంతరం వేల కోట్ల రూపాయల ఆస్తులున్నట్లు పోలీసులు గుర్తించారు. టైలరింగ్ ద్వారా ఆస్తులు సంపాదించినట్లు తెలిపినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎన్ని ఆస్తులను సీజ్ చేశారనే దానిపై ఐటీ శాఖ ఆరా తీస్తోంది. గత రెండు రోజులుగా హసీనాను అధికారులు విచారిస్తున్నారు. కొంతకాలంగా టైలరింగ్ చేస్తున్నట్లు, బట్టల వ్యాపారం ద్వారా ఆస్తులు సంపాదించినట్లు విచారణలో హసినా వెల్లడించినట్లు సమాచారం. ఈ కేసును సిట్ అధికారులు దర్యాప్తు చేయడం మొదలు పెట్టారు. చాలా మందిని బెదిరించి భూ కబ్జాలకు పాల్పడినట్లు పోలీసుల విచారణ నిర్ధారణ అయింది. కనిపించిన స్థలాన్ని కబ్జా చేయడం..లేదంటే చంపేస్తానని వార్నింగ్‌ ఇవ్వడం వంటివి నయీమ్ చేసేవాడని అధికారుల విచారణలో తేలింది. అధికారులు తవ్వేకొద్ది నమ్మలేని నిజాలు బయటపడ్డాయి. ఎవరూ ఊహించనన్నీ ఆస్తులు కూడబెట్టినట్లు పోలీసులు నిర్ధారించారు. బినామీ పేరిట కోట్ల రూపాయల ఆస్తులు సంపాధించిన ఇన్‌కామ్‌ ట్యాక్స్‌ ను ఎగ్గొట్టినట్లు అధికారుల విచారణలో తేలింది. ఈ కేసులో అధికారులు లోతుగా విచారిస్తుంటే బాధితులు ఒక్కసారిగా బయటకు వచ్చారు. దాదాపు 293 కేసులు నమోదైనట్లు సమాచారం. తాజాగా ఐటీ అధికారుల విచారణలో ఎన్ని ఆస్తులున్నాయో లెక్కతేలనుంది.

నయీమ్‌ ఆస్తుల లెక్క...

తెలంగాణతోపాటు ఏపీ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌, గోవా రాష్ట్రాల్లో నయీమ్‌కు ఆస్తున్నట్లు గురించారు.

మొత్తం భూములు : 1015 ఎకరాలు

ఇళ్ల స్థలాలు : 1,67,117చ.అడుగులు

భవనాలు : 29

నగదు : రూ.2,08,52,400

బంగారు అభరణాలు :1.90 కిలోలు

వెండి వస్తువులు :873 గ్రాములు

మొబైళ్లు : 258

రిజిస్ట్రేషన్‌ పత్రాలు : 203

ఖరీదైన కార్లు, ద్విచక్ర వాహనాలు, మారణాయుధాలు

Next Story