గాంధీ జయంతి రోజు మద్యం దుకాణాలు ఏంటి.?
By న్యూస్మీటర్ తెలుగు Published on 2 Oct 2019 6:24 PM ISTగాంధీ జయంతి రోజు మద్యం దుకాణాలు నిర్వహించడమేంటని టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులను పెట్టి మరీ మద్యం అమ్మిస్తూ గాంధీ జయంతి రోజున ప్రజలకు ఎలాంటి సందేశాలు ఇస్తున్నారని ప్రభుత్వాన్ని నిలదీశారు. ఎవరి విశ్లేషణకూ అర్థంకాని రీతిలో జగన్ వ్యవహారశైలి ఉందని, రాష్ట్రం జగన్ జాగీరు కాదని అన్నారు. బ్రిటీష్ వారైనా చట్టాన్ని అనుసరించేవారని, జగన్ కనీసం చట్టాన్ని కూడా గౌరవించడం లేదని విమర్శించారు. చిన్నాన్నను ఎవరు చంపారో చెప్పలేని వ్యక్తికి ముఖ్యమంత్రి పదవి ఎందుకు? అని ప్రశ్నించారు.
పేదలకు అన్నం పెట్టే అన్నాక్యాంటీన్లను మూసేశారని ప్రభుత్వంపై చంద్రబాబు మండిపడ్డారు. ఇసుక కొరతతో లక్షలాది మంది కార్మికులు రోడ్డునపడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ సచివాలయాలను 2003లోనే ప్రారంభించామని, ఇప్పుడేదో కొత్తగా తీసుకొచ్చినట్టు గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు. 11 అవినీతి కేసులున్న వ్యక్తి నీతిమంతుడిలా చెలామణి అవుతున్నారని అన్నారు. ప్రజలంతా అవినీతిపరులని తానొక్కడే నీతివంతుడినని జగన్ భావిస్తున్నారని చంద్రబాబు ఎద్దేవా చేశారు. ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని మహాత్ముడి స్పూర్తితో ముందుకు సాగుదామని చంద్రబాబు పిలుపునిచ్చారు.