గద్వాల ఎమ్మెల్యేకు కరోనా నెగిటివ్
By తోట వంశీ కుమార్ Published on 22 April 2020 7:06 AM GMTతెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. రోజు రోజుకు రాష్ట్రంలో పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఇక గద్వాల జిల్లా కేంద్రంలో కరోనా చాపకింద నీరులా విస్తరిస్తోంది. దీంతో కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేసి కరోనా నియంత్రణ చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 32 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. ఇద్దరు మృతి చెందారు.
కాగా.. గద్వాల్ ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో ఆయనకు కరోనా నెగిటివ్ వచ్చిందని అధికారులు తెలిపారు.
సోషల్ మీడియాలో ఓ వార్త హల్చల్ చేసింది. ఎమ్మెల్యే అనుచరుడు ఒకరు ఇటీవల చనిపోగా.. ఆయన అంత్యక్రియల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. కాగా మరణించిన వ్యక్తి కుటుంబ సభ్యుల్లో ఒకరికి కరోనా పాజిటివ్ అని తేలిందనేది ఆవార్త సారాంశం. దీంతో వెంటనే అప్రమత్తమైన ఎమ్మెల్యే గత శనివారం నుంచి హోం క్వాంరటైన్లోకి వెళ్లిపోయారు. ఎమ్మెల్యేకు కరోనా పరీక్షలు నిర్వహించారు. ఇక ఎమ్మెల్యేను కలిసిన వారిని పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా హోం క్వారంటైన్లో ఉంచారు. ప్రస్తుతం ఎమ్మెల్యేకు కరోనా నెగిటివ్ రావడంతో.. క్వారంటైన్లో ఉన్న వారి విషయంలో అధికారులు ఓ నిర్ణయం తీసుకోనున్నారు.