పురావస్తు శాఖ కీలక నిర్ణయం.. 6 నుంచి గోల్కొండ, చార్మినార్‌ సందర్శించొచ్చు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  4 July 2020 6:04 AM GMT
పురావస్తు శాఖ కీలక నిర్ణయం.. 6 నుంచి గోల్కొండ, చార్మినార్‌ సందర్శించొచ్చు

కరోనా మహమ్మారి నేపథ్యంలో లాక్‌డౌన్‌ కారణంగా మూడు నెలలుగా పర్యాటకులు లేక గోల్కొండ, చార్మినార్‌ వంటి పర్యాటక ప్రదేశాలు బోసిపోయాయి. లాక్‌డౌన్‌ సడలింపుల్లో భాగంగా కేంద్రం పర్యాటక సందర్శనకు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో పురావస్తు శాఖ అధికారులు శుక్రవారం అంతర్గత సమావేశం నిర్వహించారు. ఈ నెల 6 నుంచి గోల్కొండ, చార్మినార్‌లోకి పర్యాటకులను అనుమతించాలని నిర్ణయం తీసుకుంది.

కాగా.. ప్రతి రోజు 2000 మందికి మాత్రమే అనుమతి ఉంటుందని గోల్కొండ కోట పర్యవేక్షణాధికారి నవీన్‌ తెలిపారు. ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్‌ చేసుకోవాలని సూచించారు.

కొవిడ్‌-19 నిబంధనలను ప్రతి ఒక్కరూ తప్పని సరిగా పాటించాలన్నారు. మాస్కులు ధరించడంతో పాటు భౌతిక దూరం తప్పని సరి అన్నారు. తినుబండారాలను అనుమతించమని, క్యాంటీన్‌లో కేవలం మంచినీరు మాత్రమే ఉంటుందన్నారు. ప్రతి రోజు ఉదయం 8.30 నుంచి సాయంత్రం 5.30 వరకు పర్యాటకులకు అనుమతి ఉంటుందన్నారు. టికెట్లను కేంద్ర పురావస్తు శాఖ వెబ్‌సైట్‌ asi.nic.in వెబ్‌సైట్‌లో బుక్‌ చేసుకోవచ్చు.

Next Story