తెలంగాణలో నాలుగో కరోనా కేసు
By Newsmeter.Network Published on 17 March 2020 6:32 AM GMTకరోనా వైరస్ ప్రభావంతో ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. నిన్నమొన్నటి వరకు భారత్లో అంతగా కనిపించని కరోనా వైరస్ ప్రభావం భారత్లోనూ విజృంభిస్తోంది. భారత్లో ఇప్పటికే 125 కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులు పేర్కొంటున్నారు. కాగా ముగ్గురు ఈ వైరస్ భారిన పడి చికిత్స పొందుతూ మృతి చెందారు. ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా వైరస్ భారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. ఏపీలో ఒక పాజిటివ్ కేసు నమోదు కాగా, తెలంగాణలో పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది.
ఇప్పటికే తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపడుతుంది. పాఠశాలలు, కళాశాలలకు 31వరకు బంద్ ప్రకటించిన ప్రభుత్వం , మాల్స్, థియేటర్లు, పబ్లు కు 31వ తేదీ వరకు తెరవద్దని ఆదేశాలు ఇచ్చింది. దీంతో గత మూడు రోజులుగా హైఅలర్ట్ ప్రకటించినట్లయింది. మరోవైపు విదేశాల నుంచి వచ్చే వారిని వికారాబాద్లోని ఐసోలేషన్ కేంద్రాలకు తరలిస్తున్నారు. దీంతో అనంతగిరి హరిత రిసార్ట్స్ లో ఇప్పటికే ఐసోలేషన్ వార్డులు ఫుల్ అయ్యాయి.
Also Read :అందరూ మాస్కులు వాడాల్సిన పనిలేదు.. వారు మాత్రమే ..
ఇప్పటి వరకు ఎయిర్ పోర్టులో స్క్రీనింగ్ హెల్త్6 డెస్క్ ద్వారా 63,181 మందికి స్క్రీనింగ్ నిర్వహించారు. ఒక్కరోజులో 3,151 మందికి ఎయిర్ పోర్టు హెల్త్ డెస్క్ లో స్ర్కీనింగ్ చేసింది. స్వచ్ఛందంగా వచ్చిన వారు 850కాగా ఇప్పటి వరకు 412 మంది ఇతర రాష్ట్రాల వారు గాంధీ హాస్పిటల్కు క్యూ కట్టారు. గాంధీ, ఫీవర్ హాస్పిటల్స్లో ఐసోలేషన్ అయిన వారి సంఖ్య 395కాగా.. ఆరోగ్య శాఖ సూచనల మేరకు ఇంట్లోనే ఐసోలేట్ అయిన వారు 868 మంది. ఇప్పటి వరకూ గాంధీలో 395 మంది టెస్టులు నిర్వహించారు. టెస్టులు చేసిన వారిలో 369 మందికి నెగిటివ్ రాగా, తెలంగాణలో నాలుగు పాజిటివ్ కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. మరోవైపు 19 మంది టెస్టుల కోసం వేచి ఉన్నారు. ఇదిలాఉంటే రాష్ట్రంలో ఎంత కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినా, ప్రజల్లో విస్తృత అవగాహన కల్పిస్తున్నా, విదేశాల నుంచి వచ్చేవారిని నిలిపివేస్తున్నా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతుండటంతో ప్రజలు ఆందోళణ వ్యక్తం చేస్తున్నారు.