పాకిస్తాన్‌లో తొలి కరోనా మృతి

By అంజి  Published on  18 March 2020 2:46 AM GMT
పాకిస్తాన్‌లో తొలి కరోనా మృతి

పాకిస్తాన్ లో కోవిడ్-19 కేసులు ఆకస్మికంగా పెరిగిపోయాయి. రెండు రోజుల క్రితం వరకూ పదులలో ఉన్న కేసులు ఇప్పుడు ఏకంగా 189కి చేరుకున్నాయి. గత 24 గంటల్లోనే 90కిపైగా కరోనా కేసులు నిర్ధారణ కావడంతో.. ఒక్కసారిగా పాక్‌లో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరిగింది. పంజాబ్, సింధు, ఖైబర్ ఫఖ్తూ‌న్‌ఖ్వా ప్రావిన్సులలో కొత్త కేసులు నమోదయ్యాయి. సింధులోనే 146 మందికి కరోనా సోకింది. వీరిలో 119 మంది యాత్రికులు కావడం గమనార్హం. వీరిందర్నీ సుఖ్ఖూర్, కరాచీ, హైదరాబాద్‌ల్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు.

మరోవైపు పాకిస్తాన్‌లో తొలి ‘కరోనా’ మరణం నమోదైంది. కోవిడ్‌ -19 లక్షణాలున్న ఓ వ్యక్తి మంగళవారం మృతి చెందినట్లు పాక్‌ ప్రభుత్వం ప్రకటించింది. హఫీజాబాద్‌కు చెందిన అతను ఇటీవలే ఇరాన్ నుంచి స్వదేశానికి తిరిగి వచ్చాడు. కరోనా లక్షణాలు ఉండడంతో ఇరాన్–టాఫ్టాన్‌ సరిహద్దుల్లో అతడిని రెండు వారాల పాటు క్వారెంటైన్‌లో ఉంచి చికిత్స అందించారు. అయితే, అతని ఆరోగ్యం క్షీణించడంతో పాకిస్తాన్‌కు తరలించారు. లాహోర్‌లోని ఆస్పత్రిలోని ఐసోలేషన్‌ వార్డులో ఉంచి చికిత్స అందించగా.. మంగళవారం మృతి చెందాడు.

ఇక బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో ఇరాన్ సరిహద్దుకు సమీపంలో ఉండే తఫ్తాన్‌లో పాకిస్థానన్ వందలాది మందిని క్వారంటైన్లో ఉంచింది. వీరిలో చాలా మంది క్వారంటైన్ ముగిసిన తర్వాత తమ స్వస్థలాలకు రావడంతో ఒక్కసారిగా కేసుల సంఖ్య గణనీయంగా పెరిగింది. కొత్తగా కరోనా సోకిన వారిలో ఎక్కువ మంది ఇరాన్ నుంచి తిరిగొచ్చిన వారేనని అధికారులు చెబుతున్నారు. చైనా, ఇటలీ తర్వాత కరోనా ప్రభావం ఇరాన్‌లోనే ఎక్కువగా ఉన్న సంగతి తెలిసిందే.

తఫ్తాన్ నుంచి ఖైబర్ ప్రావిన్స్ వచ్చిన వారిలో 19 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ఇరాన్, అప్ఘానిస్థాన్‌ల వెంబడి సరిహద్దులను రెండు వారాలపాటు మూసివేస్తూ పాకిస్థాన్ నిర్ణయం తీసుకుంది. దేశంలోని అన్ని విద్యాసంస్థలకు మూడు వారాలపాటు సెలవులు ప్రకటించారు. చాలా హోటళ్లు కరోనా అనుమానితులకు క్వారంటైన్లుగా మారిపోయాయి.

Next Story