గాంధీలో కరోనా పాజిటివ్ వ్యక్తిని పరామర్శించిన మంత్రి ఈటల
By సుభాష్ Published on 7 March 2020 10:20 AM IST
తెలంగాణలో కరోనా కేసు నమోదు కావడంతో ప్రజల్లో మరింత భయాందోళన నెలకొంది. ఇప్పటి ఈ కరోనా బారిన పడి 3వేలకుపైగా మృతి చెందారు. తాజాగా కరోనా వైరస్ పాజిటివ్గా నమోదైన సాప్ట్ వేర్ ఉద్యోగి వద్దకు మంత్రి స్వయంగా వెళ్లి పరామర్శించారు. ఆయన యోగాక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో భయాందోళన చెందవద్దని, పూర్తిస్థాయిలో చికిత్స అందిస్తామని భరోసా ఇచ్చారు.
ప్రజల్లో ఉన్నభయాలను తొలగించేందుకుకే పర్యటిస్తున్నా..
ప్రజల్లో కరోనా అనుమానాలను తొలగించేందుకు 24 గంటల పాటు పని చేస్తున్నామని అన్నారు. సోషల్ మీడియాలో చైనా కు సంబంధించి వీడియోలు వైరల్ కావడంతో ప్రజల్లో మరింత భయాందోళన నెలకొందని, దీని గురించి ఎలాంటి ఆందోళన చెందవద్దని సూచించారు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను నమ్మవద్దని చెప్పారు. తెలంగాణలో ఒక కరోనా కేసు నమోదు కావడంతో యుద్ధప్రాతిపదికన చర్యలు చర్యలు చేపట్టామన్నారు. కరోనా గురించి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక నిధులు కేటాయించనున్నారని చెప్పారు. 24 గంటల పాటు వైద్య ఆరోగ్యశాఖలో ఉన్న స్పెషల్ చీఫ్ సెక్రెటరీ నుంచి సిబ్బంది వరకు పని చేస్తున్నారని, వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అలాగే మీడియా కూడా సంయమనంతో ప్రజలను చైతన్య పరిచేందుకు వార్తలు ప్రచురించినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు.
ఎవరో ఏదో పుకార్లు సృష్టిస్తే వాటిని నమ్మి భయభ్రాంతులకు గురి కావద్దన్నారు. కరోనా సోకిన వ్యక్తుల డ్రాప్ లెట్స్ ద్వారా మాత్రమే మరొకరికి సోకుతుంది తప్ప గాంధీ ఆస్పత్రిలో ఉన్న అందరికీ వైరస్ వల్ల ప్రమాదం ఉండే అవకాశమే లేదని మంత్రి స్పష్టం చేశారు. కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తి ఆరోగ్యం నిలకడగా ఉందని, ఎలాంటి ఆందోళన చెందవద్దని మరోసారి సూచించారు.
వైద్యులతో చర్చించాను
కరోనా వైరస్ గురించి గాంధీ ఆస్పత్రిలోని వైద్యులతో చర్చించానని మంత్రి చెప్పారు. కరోనా గురించి ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాలని వారికి సూచించామని అన్నారు. అలాగే ఐసోలేషన్ వార్డులో ఉన్న వైద్యులతో మాట్లాడారు. కరోనా కారణంగా వైద్యులు తీసుకుంటున్న చర్యలపై మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచేలా చర్యలు తీసుకోవాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు. అలాగే ఐసోలేషన్ వార్డులో ఉన్న వారు చాలా మంది ఉన్నత ఉద్యోగాల్లో ఉన్నవారు ఉండటంతో వారికి వైఫై సౌకర్యం కల్పించాలని సూచించారు.
లేనిపోని పుకార్లు వ్యాపించిన వారిపై చర్యలు
కరోనా వల్ల లేనిపోని పుకార్లు వ్యాపించిన వ్యక్తులపై కఠిన చర్యలు చేపట్టనున్నట్లు మంత్రి హెచ్చరించారు. ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే విధంగా సోషల్ మీడియాలో వీడియోలు, ఫోటోలు పెడుతున్నారని, వాటిని ప్రజలు నమ్మవద్దని, అలాంటి వారిపై పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. వైరస్ భయాలు పోగొట్టే విధంగా ప్రజల్లో చైతన్యం తీసుకువాలని సూచించారు.