'కరోనా'పై మంత్రి ఈటల వీడియో కాన్ఫరెన్స్
By సుభాష్ Published on 7 March 2020 5:01 PM IST
తెలంగాణలో కరోనా వైరస్ వ్యాపించిన నేపథ్యంలో ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతోంది. కరోనా పాజిటివ్ కేసు నమోదు కావడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. అధికారులను అప్రమత్తం చేస్తూ తగిన జాగ్రత్తలు తీసుకుంటుంది. ఈ సందర్భంగా వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ఎప్పటికప్పుడు అధికారులను అప్రమత్తం చేస్తూ వివరాలు సేకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి ఈటల రాష్ట్రంలో ఆయా జిల్లాల అధికారులతో వీడియో కార్ఫరెన్స్ నిర్వహించారు. కరోనా పై అప్రమత్తంగా ఉండాలని, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ప్రజల్లో ఉన్న అపోహాలు, భయాలను తొలగించాలని అన్నారు.
ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మెడికల్ ఆఫీసర్ తప్పకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. విదేశాల నుంచి రాష్ట్రంలోకి వచ్చిన ప్రతి వ్యక్తి వివరాలు సేకరించాలన్నారు. అలాగే కరీంనగర్కు గ్రానైట్ వ్యాపారం కోసం వచ్చిన చైనా, ఉజ్జెకిస్తాన్ వారిని గుర్తించి క్వారంటైన్లో ఉంచినట్లు కరీంనగర్ వైద్యాధికారి కాన్ఫరెన్స్లో తెలిపారు. కరోనాపై ఏవైనా అనుమానాలుంటే ఐసోలేషన్లో ఉంచాలని అన్నారు. విధుల పట్ల నిర్లక్ష్య చేసినా ఊరుకునేది లేదని హెచ్చరించారు.
వచ్చే మంగళవారం ఉదయం పది గంటలకు ప్రతి గ్రామంలో, పాఠశాలలో ఆశ వర్కర్లు, వైద్య సిబ్బంది కరోనా గురించి అవగాహన కల్పించాలని మంత్రి ఆదేశించారు.