బయటకు వచ్చిన 'ఎంత మంచివాడవురా' అసలు కథ..!
By న్యూస్మీటర్ తెలుగు Published on 22 Dec 2019 7:51 AM GMTనందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా 'శతమానంభవతి' చిత్రంతో జాతీయ పురస్కారాన్నిగెలుచుకున్న సతీష్ వేగేశ్న దర్శకత్వంలో రూపొందుతోన్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఎంత మంచివాడవురా. ఆడియో రంగంలో అగ్రగామిగా వెలుగొందుతున్న ఆదిత్యా మ్యూజిక్ సంస్థ తొలిసారిగా చిత్ర నిర్మాణ రంగంలోకి ప్రవేశించి ఈ చిత్రాన్నినిర్మిస్తోంది. దేవి మూవీస్ శివలెంక కృష్ణప్రసాద్ ఈ చిత్రానికి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటుంది. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను జనవరి 15న విడుదల చేస్తున్నారు.
ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు సతీష్ వేగేశ్న చిత్ర విశేషాలను తెలియచేస్తూ...టైటిల్ పెట్టగానే ఇండస్ట్రీలోని మంచి వ్యక్తుల్లో కళ్యాణ్ రామ్ ఒకరు. ఆయనకు తగ్గ టైటిల్ పెట్టావని చాలా మంది అన్నారు. ఉమేష్గుప్తా, సుభాష్ గుప్తా, కృష్ణప్రసాద్ ఏం అడిగితే దాన్ని సమకూర్చి బెటర్గా చేయమని ఎంకరేజ్ చేశారు. మ్యూజిక రంగంలో అగ్రగామి అయిన ఆదిత్య మ్యూజిక్ తొలిసారి నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టింది.
అందులో తొలి సినిమా నాతోనే చేయడం ఆనందంగా అనిపిస్తుంది. హీరో, డైరెక్టర్ అని కాకుండా కళ్యాణ్ రామ్ నాతో బాగా ఇన్వాల్వ్ అయ్యారు. ఆయన కొత్తగా కనపడతారు. నన్ను నమ్మినందుకు కళ్యాణ్ రామ్ థ్యాంక్స్. మెహరీన్ కూడా పెర్ఫామెన్స్కు స్కోప్ ఉన్న పాత్రలో చక్కగా నటించింది. గుజరాతీ మూవీ కాన్సెప్ట్ ఇది. సినిమా చూశాం. అందులోని మెయిన్ పాయింట్ను తీసుకుని కమర్షియల్ ఎలిమెంట్స్తో కలిపి తెలుగు ప్రేక్షకులకు నచ్చేలా సినిమా చేశాం.
మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలు కావు.. ఆర్ధిక సంబంధాలని నమ్మిన వ్యక్తిగా మా హీరో ఇందులో కనపడతారు. సినిమా బాగా వచ్చింది. అందరూ బాగా కో ఆపరేట్ చేసి సినిమా చేశారు. అందరూ మనసుకు నచ్చి సినిమా చేశాం. శతమానంభవతిని ప్రేక్షకులు ఎలాగైతే ఆదరించారో ఈ సినిమాను కూడా అలాగే ఆదరిస్తారని నమ్ముతున్నాను అని అన్నారు.