రాజస్థాన్లోని ఉదయ్పూర్లో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు విజయ్ దేవరకొండ, రష్మిక. పెళ్లి తర్వాత మొదటిసారిగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆదివారం నాడు ఈ కొత్త జంట తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు తీసుకున్నారు. రష్మిక ఆకుపచ్చ, బంగారు రంగు చీరలో, సాంప్రదాయ ఆభరణాలతో మెరిసిపోగా, విజయ్ తెల్లటి కుర్తా, ఎర్రటి శాలువాలో కనిపించారు. దర్శనానంతరం ఆలయం వెలుపల ఉన్న భక్తులకు ఈ కొత్త జంట స్వయంగా స్వీట్లు పంపిణీ చేశారు. విజయ్ సోదరుడు ఆనంద్ దేవరకొండ కూడా అక్కడే ఉన్నారు.
తమ పెళ్లి సందర్భంగా ఈ జంట ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు తదితర 23 నగరాల్లో అభిమానులకు, ప్రజలకు ప్రత్యేకంగా ప్యాక్ చేసిన స్వీట్ బాక్సులను పంపిణీ చేయనున్నారు. "V & R" అని రాసి ఉన్న ప్రత్యేక వాహనాల ద్వారా ఈ పంపిణీ జరుగుతోంది. ఆ స్వీట్ బాక్స్పై ఉన్న QR కోడ్ని స్కాన్ చేసి, అభిమానులు ఈ కొత్త జంటకు నేరుగా తమ ఆశీస్సులు, శుభాకాంక్షలు తెలియజేసేలా ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా పలు ప్రధాన ఆలయాల్లో వీరు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు.