రోజూ బిర్యానే తినలేం.. బోల్డ్‌ సీన్స్‌పై అనుపమ కామెంట్స్

టిల్లు స్క్వేర్‌ సినిమాలో బోల్డ్‌ సీన్లపై హీరోయిన్ అనుపమ ఆసక్తికర కామెంట్స్ చేసింది.

By Srikanth Gundamalla  Published on  19 March 2024 8:36 AM GMT
tollywood, tillu square movie, anupama parameswaran,

రోజూ బిర్యానే తినలేం.. బోల్డ్‌ సీన్స్‌పై అనుపమ కామెంట్స్

కేరళకు చెందిన అనుపమ పరమేశ్వరణ్‌ హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి దాదాపు ఎనిమిదేళ్లు అవుతోంది. అప్పటి నుంచి ఈమె పెద్దగా గ్లామర్‌ పాత్రల్లో కనిపించలేదు. ఒక్క రౌడీ బాయ్స్‌ సినిమాలో మాత్రమే కాస్త హద్దులు దాటి ముద్దు సీన్లలో నటించింది. ఈ ఒక్క సినిమా తప్ప ఆమె కెరియర్‌లో గ్లామర్‌ పాత్రలు అస్సలు లేవు. ట్రెడిషనల్‌గానే కనిపించింది. అయితే.. తాజాగా ఆమె సిద్ధు జొన్నలగడ్డ హీరోగా వస్తోన్న డీజే టిల్లు-2లో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాలో మాత్రం రొమాన్స్ సీన్లలో నటించినట్లు తెలుస్తోంది.

అయితే ఇండస్ట్రీలో నిలబడాలంటే క‌చ్చితంగా అందాల ఆరబోత చేయాల్సిందే అనే అనుపమ ఫిక్సయినట్లుంది. డీజే టిల్లు-2 సినిమా నుంచి రీసెంట్‌గా విడుదలైన ట్రైలర్ పోస్టర్‌.. ఫస్ట్‌ లుక్‌ ఇలా ప్రతి పోస్టర్‌లో గ్లామర్‌ షోనే చూపిస్తోంది అనుపమ. బోల్డ్‌ సీన్లలో నటించడంపై పలువురు ప్రశ్నించగా దీనికి కౌంటర్‌గానే సమాధానం చెప్పింది అనుపమ పరమేశ్వరణ్‌. బిర్యానీ ఎంత ఇష్టం ఉన్నా ప్రతిరోజూ తినలేం కదా అని కామెంట్ చేసింది. అదే విధంగా కొన్నేళ్లుగా ఒకే రకమైన క్యారెక్టర్స్‌ మళ్లీ మళ్లీ చేస్తుంటే ఎవరికైనా బోర్ కొడుతుందని చెప్పింది. అందుకే టిల్లు స్క్వేర్‌లో లిల్లి రోల్‌ చేశానని చెప్పింది. ఈ పాత్రను మిస్ చేసుకుంటే అది తన చెత్త నిర్ణయమే అవుతుందని భావించినట్లు అనుపమ పేర్కొంది. అందుకే ఈ సినిమాకు ఒప్పుకున్నానని వివరణ ఇచ్చింది. అంతేకాదు.. డైరెక్టర్‌ చెప్పినట్లుగానే సినిమాలో క్యారెక్టర్‌ కోసం నటించినట్లు అనుపమ పరమేశ్వరణ్ చెప్పింది.

రెండేళ్ల కిందట చిన్న సినిమా డీజే టిల్లు సినిమా విడుదలైంది. మంచి హిట్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. దాంతో.. సీక్వెల్‌కు ప్లాన్‌ చేశారు. సీక్వెల్‌ మరింత బాగా రావాలని..భారీ హిట్‌గా నిలవాలని ప్రయత్నిస్తున్నారు. డీజే టిల్లు తొలి పార్ట్‌ను విమల్‌ కృష్ణ తెరకెక్కించాడు. అయితే... కొన్ని కారణాల వల్ల సెకండ్‌ పార్ట్‌ని 'అద్భుతం' సినిమా డైరెక్టర్ మల్లిక్‌ రామ్‌ను లైన్‌లోకి తెచ్చారు. కాగా.. టిల్లు స్క్వేర్‌ మూవీ మార్చి 29న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Next Story