టాలీవుడ్ ఇండస్ట్రీలో సినీ కార్మికులు మరోసారి సమ్మెకు పిలుపునిచ్చారు. వేతనాల పెంపు కోసం డిమాండ్ చేస్తూ రేపటి నుంచి అన్ని సినిమా షూటింగ్లు బంద్ చేస్తున్నట్లు ప్రకటించారు. తమ డిమాండ్లు నెరవేర్చే వరకు విధులకు హాజరుకాబోమని తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ స్పష్టం చేసింది. కార్మికుల వేతనాలను తక్షణమే 30 శాతం పెంచాలని వారు కోరుతున్నారు. అంతేకాకుండా, పెంచిన వేతనాలను ఏ రోజుకు ఆ రోజే చెల్లించాలని మరో కీలకమైన షరతు విధించారు.
ఈ నిబంధనలకు అంగీకరించిన నిర్మాతలకు చెందిన సినిమా పనుల్లో మాత్రమే తాము పాల్గొంటామని తేల్చిచెప్పారు. ఈ మేరకు ఇప్పటికే తెలుగు ఫిలిం ఛాంబర్ కు సమ్మె నోటీసు అందజేశారు. పెరిగిన నిత్యావసరాల ధరలతో ప్రస్తుత వేతనాలతో జీవించడం కష్టంగా మారిందని, అందుకే వేతనాల పెంపు తప్పనిసరి అని కార్మిక సంఘాల నేతలు చెబుతున్నారు. ఈ విషయంపై ఇప్పటికే పలు దఫాలుగా నిర్మాతలతో జరిపిన చర్చలు విఫలం కావడంతో సమ్మెకే మొగ్గు చూపినట్లు తెలిపారు.