టాలీవుడ్లో విషాదం, ఎవర్గ్రీన్ పాటల రచయిత కన్నుమూత
టాలీవుడ్లో విషాదం చోటుచేసుకుంది.
By Srikanth Gundamalla Published on 12 Sept 2024 1:30 PM IST
టాలీవుడ్లో విషాదం చోటుచేసుకుంది. ఇండస్ట్రీకి ఎంతో మంచి సాంగ్స్ను అందించిన పాటల రచయిత గురు చరణ్ (77) కన్నుమూశారు. ఆయన గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. గురువారం తెల్లవారుజామున ప్రాణాలు విడిచినట్లు తెలిపారు కుటుంబ సభ్యులు. ఆయన రాసిన ఎన్నో విషాద గీతాలు ఎవర్గ్రీన్గా నిలిచాయి. ఇక మోహన్ బాబు కోసం ఆయన ప్రత్యేకంగా పాటలు రాసేవారు. మోహన్బాబు కూడా గురు చరణ్ను ప్రత్యేకంగా తన సినిమాలకు పాట రచయితగా ఎంపిక చేస్తుండేవారు. ‘ముద్దబంతి పువ్వులో మూగబాసలు’, ‘కుంతీకుమారి తన కాలుజారి’, ‘బోయవాని వేటుకు గాయపడిన కోయిలా’ వంటి ఎన్నో ఎవర్గ్రీన్ హిట్ పాటలను రచించారు గురు చరణ్.
గురుచరణ్ అసలు పేరు మానాపురపు రాజేంద్ర ప్రసాద్. అలనాటి నటి ఎం.ఆర్. తిలికం, అప్పటి దర్శకుడు మానాపురం అప్పారావు కుమారుడే గురుచరణ్. ఎం.ఎ. చదివారు. ఆ తర్వాత గీత రచయితగా అడుగుపెట్టారు. ఆచార్య ఆత్రేయ దగ్గర శిష్యరికం చేశారు గురుచరణ్. రెండు వందలకు పైగా సినిమా పాటలు రాశారు. మోహన్బాబు నటించిన చిత్రాలలో గురుచరణ్తో ఒక్క పాట అయినా తప్పకుండా రాయించేవారు.మోహన్ బాబు చిత్రాలలో చిరస్థాయిగా నిలిచిపోయిన ఎన్నో మెలోడీ, అర్థవంతమైన పాటలను గురుచరణ్ రచించారు. గురుచరణ్ మృతిపట్ల సినీ ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖులతో పాటు .. పాటల ప్రేమికులు సంతాపం తెలుపుతున్నారు.