'మ‌హేష్ అన్నా.. నీకే ఎందుకు ఈ బాధ‌ల‌న్ని..?' ఒకే ఏడాదిలో మూడు విషాదాలు

Three tragedy incidents in Mahesh Babu family in one year.సూప‌ర్ స్టార్ మ‌హేష్‌బాబుకు ఈ ఏడాది అత్యంత విషాదంగా మారింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  15 Nov 2022 3:01 AM GMT
మ‌హేష్ అన్నా.. నీకే ఎందుకు ఈ బాధ‌ల‌న్ని..? ఒకే ఏడాదిలో మూడు విషాదాలు

సూప‌ర్ స్టార్ మ‌హేష్‌బాబుకు ఈ ఏడాది అత్యంత విషాదంగా మారింది. త‌న‌కు జ‌న్మ‌నిచ్చిన త‌ల్లిదండ్రుల‌తో పాటు సోద‌రుడు ర‌మేష్‌బాబు ఆయ‌న‌కు దూరం అయ్యారు. దీంతో మ‌హేష్‌బాబు తీవ్ర దుఖః సాగ‌రంలో మునిగిపోయారు.

ఈ ఏడాది జ‌న‌వ‌రిలో ర‌మేశ్‌బాబు అనారోగ్యంతో క‌న్నుమూశారు. కాలేయ సంబంధిత వ్యాధితో బాధ‌ప‌డిన ఆయ‌న ప‌రిస్థితి విష‌మించడంతో జ‌న‌వ‌రి 8న తుదిశ్వాస విడిచారు. ఆ స‌మ‌యంలో మ‌హేష్‌బాబు క‌రోనాతో బాధ‌ప‌డుతుండ‌డంతో క‌నీసం చివ‌రి చూపుకు కూడా నోచుకోలేక‌పోయాడు. ఈ విషాదం నుంచి తేరుకోక‌ముందే త‌ల్లి ఇందిమా దేవి దూరమైంది. అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతూ హైద‌రాబాద్ ఏఐజీ ఆస్ప‌త్రిలో చేరిన ఆమె చికిత్స పొందుతూ సెప్టెంబ‌ర్‌లో మ‌ర‌ణించింది.

తల్లి మ‌ర‌ణాన్ని మ‌హేష్ ఇంకా జీర్ణించుకోలేదు. ఇప్పుడిప్పుడే ఆ బాధ నుంచి తేరుకుంటుండగా క‌న్న తండ్రి మ‌ర‌ణం మ‌హేష్‌ను మ‌రింత విషాదంలోకి నెట్టేసింది. ఆదివారం రాత్రి కార్డియాక్ అరెస్టుకు గురైన కృష్ణ‌ను కుటుంబ స‌భ్యులు గ‌చ్చిబౌలిలోని కాంటినెంట‌ల్ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. చికిత్స పొందుతూ మంగ‌ళ‌వారం తెల్ల‌వారుజామున 4 గంట‌ల స‌మ‌యంలో ఆయ‌న తుది శ్వాస విడిచారు.

ఇలా ఒకే ఏడాదిలో.. ఒక‌రు దూరం అయ్యార‌నే బాధ‌ను మ‌హేష్ మ‌రిచిపోక‌ముందే మ‌రొక‌రు దూరం అయ్యారు. దీంతో "మ‌హేష్ అన్నా.. నీకే ఎందుకు ఈ బాధ‌లు అన్ని..? STAY STRONG "అని మ‌హేష్‌కు ధైర్యం చెబుతూ అభిమానులు సోష‌ల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

కృష్ణ వారసుడిగా సూపర్ స్టార్ మహేష్ బాబు సినీ ప‌రిశ్ర‌మ‌లోకి అడుగుపెట్టారు. అయిన‌ప్ప‌టికీ త‌నదైన శైలిలో న‌టిస్తూ సూప‌ర్ స్టార్‌గా ఎదిగారు మహేష్ బాబు. ప్ర‌స్తుత తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లోని టాప్ హీరోల్లో ఆయ‌న ఒక‌రు.

Next Story