సినీ పరిశ్రమలో మరో విషాదం.. ప్రముఖ గాయకుడు, నటుడు వినాయగం కన్నుమూత
Tamil Singer and Actor Manikka Vinayagam passes away.సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది.
By తోట వంశీ కుమార్
సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణం, హీరో పునీత్ రాజ్కుమార్, నృత్యదర్శకుడు శివశంకర్ మాస్టర్ వంటి వారి మరణాలను జీర్ణించుకోకముందే తాజాగా ప్రముఖ గాయకుడు, నటుడు మాణిక్య వినాయగం కన్నుమూశారు. గత కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆదివారం రాత్రి పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. ఆయన వయస్సు 73 సంవత్సరాలు. ఆయన అంత్యక్రియలు నేడు(సోమవారం) అడయార్లో నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మాణిక్య వినాయగం మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలుపుతున్నారు.
'నాట్యాచార్య పద్మశ్రీ' వజువూరు బి. రామయ్య పిళ్లై చిన్న కుమారుడే వినాయగం. ఆయన 1943 డిసెంబర్ 10న జన్మించారు. తన మామయ్య, ప్రముఖ గాయకుడు జయరామన్ వద్ద సంగీత పాఠాలు నేర్చుకున్నారు. 2001 సంవత్సరంలో విక్రమ్ హీరోగా నటించిన 'దిల్' అనే తమిళ చిత్రంలో 'కన్నుకుల్లా కెలుతి' పాటతో గాయకుడిగా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. అన్ని బాషల్లో కలిపి 800లకిపైగా పాటలను పాడారు.
సినిమా పాటలే కాకుండా వందలాది జానపద గీతాలు, భక్తిగీతాలు పాడారు. ఆయన పాటలు ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించేంది. ఇక తెలుగుతో మెగాస్టార్ చిరంజీవి నటించిన 'శంకర్ దాదా ఎంబీబీఎస్' సినిమాలో 'పట్టుపట్టు చేయ్యే పట్టు' పాటతో మెప్పించారు. ఆయన పాటలకే పరిమితం కాలేదు. నటుడిగానూ రాణించారు. 2003లో ధనుష్ హీరో గా వచ్చిన 'తిరుడ తిరుడి' చిత్రంలో ధనుష్ తండ్రి పాత్రను పోషించాడు. 'గంభీరం', 'పెరళగన్ అరివుమణి' వంటి పలు సినిమాలలో కూడా నటించారు.