గతకొంత కాలంగా సినీ పరిశ్రమను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే కరోనా మహమ్మారి కారణంగా అతలాకుతలం అయిన సినీ ఇండస్ట్రీ.. సినీ నటులు మృత్యువాత పడుతుండడంతో విషాదాన్ని నింపుతున్నాయి. సొంతంగా ఓ సినిమాను నిర్మించి, దానిలో హీరోగా నటించిన ఓ నటుడు.. అందులో పేరు తెచ్చుకోలేక, ఇండస్ట్రీలో కోరుకున్న గుర్తింపు రాక, మనస్తాపంతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. తమిళ నటుడు, నిర్మాత కుమారజన్(35) నమక్కల్లోని తన నివాసంలో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.
అతను సాంతిప్పొమ్ సింతిప్పొమ్ అనే చిత్రాన్ని నిర్మించడమే కాక అందులో హీరోగా నటించాడు. కానీ ఇది అతడికి పెద్దగా పేరు తీసుకురాలేదు. ఆ తర్వాత కూడా ఇండస్ట్రీలో తను కోరుకున్న గుర్తింపు రాకపోవడంతో కొంతకాలంగా నిరాశలో ఉన్నాడు. తాను ఊహించినట్లుగా కెరీర్ సంతృప్తికరంగా ముందుకు సాగకపోవడంతో మనస్థాపానికి గురైన ఆయన ప్రాణాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే.. అతడి గదిలో ఎలాంటి సూసైడ్ నోటు లభించలేదు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి.. మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.