అమెరికాలో హీరోయిన్‌ సమంత సందడి

అమెరికాలో హీరోయిన్ సమంత సందడి చేశారు. వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

By Srikanth Gundamalla  Published on  21 Aug 2023 8:08 AM GMT
Samantha,  america, India Day Parade,

అమెరికాలో హీరోయిన్‌ సమంత సందడి

అమెరికాలో హీరోయిన్‌ సమంత పర్యటిస్తున్నారు. ఇటీవల ఇక్కడ నిర్వహించిన ఖుషీ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొని మళ్లీ అమెరికా వెళ్లారు. అయితే.. హీరో, హీరోయిన్లు ఫారెన్‌ టూర్లకు వెళ్తుంటారు. కానీ.. సమంత వెళ్లడం గురించి కాస్త ప్రత్యేకంగానే మాట్లాడుకున్నారు జనాలంతా. ఎందుకంటే.. ఆమె కొంతకాలంగా అరుదైన వ్యాధితో బాధపడుతున్నారు. దాంతో.. ఆమె అమెరికా వెళ్లి ట్రీట్‌మెంట్‌ చేయించుకుంటారని అనుకున్నారు. కానీ.. ప్రస్తుతం అమెరికాలో ఆమె పర్యటనకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఫోటోలు, వీడియోలు చేసిన జనాలు ఇందుకేనా సమంత అమెరికా వెళ్లింది! అంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

అయితే.. అమెరికాలో భారత స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రతి ఏటా న్యూయార్క్‌లో 'ఇండియా డే పరేడ్‌' వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు. ఈ క్రమంలోనే ఆదివారం మధ్యాహ్నం ఈ వేడుకలను నిర్వహించారు. ఈ ఈవెంట్‌లోనే పాల్గొన్నారు సమంత. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. సమంతతో పాటు ఈవెంట్‌లో ఆద్యాత్మిక గురువు రవిశంకర్, బాలీవుడ్‌ బ్యూటీ జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ కూడా పాల్గొన్నారు. అయితే.. అమెరికాలో నిర్వహించిన ఇండియా డే పరేడ్‌ వేడుకల్లో సమంత ఉత్సాహంగా పాల్గొనడం పట్ల ఆమె అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మీరు ఎప్పుడూ ఇలానే హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నట్లు కామెంట్స్ పెడుతున్నారు.

ఈ సందర్భంగా మాట్లాడిన సమంత..న్యూయార్క్‌లో ఉండటం చాలా గర్వంగా ఉందని చెప్పింది. భారతదేశ సంస్కృతి సంప్రదాయాలు ఎంతో గొప్పవి అని.. తాను చూసిన దృశ్యాలు మరోసారి నిరూపితం చేశాయని తెలిపారు. ఈ మూమెంట్స్‌ ఎప్పటికీ తన మనసులో నిలిచిపోతాయని పేర్కొన్నారు. ఇక ఈ అరుదైన గౌరవం దక్కినందుకు కూడా తాను సంతోషంగా ఉన్నానని.. అందరికీ కృతజ్ఞతలు చెప్పారు సమంత. కాగా.. ఇండియా డే పరేడ్‌ వేడుకల్లో సామ్‌ కంటే ముందు అల్లు అర్జున్, రానా, అభిషేక్‌ బచ్చన్ సహా తదితరులు పాల్గొన్నారు.

Next Story