మాయమాటలు చెప్పి అధిక వడ్డి ఆశ చూపి.. రూ.కోట్లు కాజేసిన శిల్పాచౌదరి మోసాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. శిల్పా చౌదరి మోసం చేసిన వారి జాబితా రోజు రోజుకు పెరిగిపోతుంది. ఆమె అరెస్టై జైలులో ఉండడంతో.. బాధితులు స్టేషన్కు క్యూ కడుతున్నారు. తాజాగా మహేష్బాబు సోదరి, సుదీర్ బాబు భార్య ప్రియదర్శి కూడా పోలీసులను ఆశ్రయించారు. శిల్ప తన దగ్గర రూ.2.9 కోట్ల తీసుకుని తిరిగి ఇవ్వలేదని ఆమె పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
శిల్పాచౌదరి మోసాల్లో మరో కోణాన్ని పోలీసులు తెలుసుకున్నారు. దివానోస్ పేరుతో జూదశాలను నిర్వహించిందని.. ఇందులో 90 మంది సెలబ్రెటీల కుటుంబాలకు చెందిన మహిళలున్నారని గుర్తించారు. టీవీ, సినీ నిర్మాతగా పరిచయం చేసుకున్న శిల్పాచౌదరి.. సినీప్రముఖుల కుటుంబాల్లోని మహిళలను తరచూ కలుసుకుంటూ వారాంతాల్లో పార్టీల పేరుతో ఆహ్వానించేది. వారితో పరిచయాలు పెంచుకుని మాయమాటలు చెప్పి ఎక్కువ వడ్డీ ఆశ చూపి డబ్బులు తీసుకునేది. ఇలా దాదాపు రూ.100 నుంచి రూ.200 కోట్లు వసూలు చేసినట్లుగా తెలుస్తోంది. శిల్పా చౌదరి రూ.50 కోట్ల రూపాయలు హవాలా ద్వారా విదేశాలకు తరలించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో శిల్పా చౌదరికి ఉన్న 6 బ్యాంక్ అకౌంట్స్పై పోలీసులు ఆరా తీస్తున్నారు. వివరాలు ఇవ్వాలంటూ పోలీసులు బ్యాంకర్లకు లేఖ రాశారు
మరో వైపు తమకు బెయిల్ ఇవ్వాలంటూ రాజేంద్రనగర్ కోర్టును ఆశ్రయించారు శిల్ప చౌదరి దంపతులు. కస్టడికీ ఇవ్వాలంటూ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ రెండింటిపై నేడు కోర్టు విచారణ చేపట్టనుంది.