లోకనాయకుడు కమల్ హాసన్ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తాజాగా కమల్ ఆరోగ్యంపై ఆయనకు చికిత్స అందిస్తున్న ఆస్పత్రి వర్గాలు బులిటెన్ను విడుదల చేశాయి. ఆ బులిటెన్ ప్రకారం.. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు. ఆయన కోలుకుంటున్నట్లు చెప్పారు. తాజా బులెటిన్లో వివరాలను చూసి ఆయన అభిమానులు ఊరట చెందుతున్నారు. ఆయన త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని ఆకాంక్షిస్తున్నారు.
ఇటీవల కమల్హాసన్ అమెరికాకు వెళ్లి వచ్చారు. ఈ క్రమంలో ఆయనలో కొవిడ్ లక్షణాలు బయటపడ్డాయి. దీంతో కరోనా పరీక్షలు చేయించుకున్నారు. ఇందులో పాజిటివ్గా వచ్చింది. వైద్యుల సూచనల మేరకు ఆయన వెంటనే ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. కాగా.. ఇప్పటికే సూపర్ స్టార్ రజినీకాంత్.. కమల్హాసన్ కు ఫోన్ చేసి పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. కమల్ను పరామర్శించిన వారిలో కోలీవుడ్ ఇండస్ట్రీకి చెంది ప్రభు, శరత్ కుమార్, విష్ణు విశాల్,శివకార్తికేయన్ తో పాటు పలువురు ఉన్నారు. కమల్ కూతురు శృతిహాసన్ షూటింగ్ పనులు అన్ని ముగించుకుని తన తండ్రిని దగ్గరుండి చూసుకోవడానికి చెన్నైకి చేరుకున్నట్లు తెలుస్తోంది.