ఎన్టీఆర్ 102వ జయంతి..జూనియర్ ఎన్టీఆర్ ఎమోషనల్ పోస్టు

దివంగత మాజీ సీఎం నందమూరి తారక రామారావు 102వ జయంతి వేడుకలు హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్‌లో నిర్వహించారు.

By Knakam Karthik
Published on : 28 May 2025 11:28 AM IST

Hyderabad News NTR Jayanthi, Nandamuri Taraka Rama Rao, Jr NTR, Kalyan Ram

ఎన్టీఆర్ 102వ జయంతి..జూనియర్ ఎన్టీఆర్ ఎమోషనల్ పోస్టు

టీడీపీ వ్యవస్థాపకులు, దివంగత మాజీ సీఎం నందమూరి తారక రామారావు 102వ జయంతి వేడుకలు హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్‌లో నిర్వహించారు. తెల్లవారుజామున ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చేరుకున్న జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లకు అభిమానులు పెద్దఎత్తున స్వాగతం పలికారు. అనంతరం ఎన్టీఆర్ సమాధి వద్ద నివాళులర్పించి, పుష్పగుచ్ఛాలు పెట్టి వారి తాతను స్మరించుకున్నారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ప్రముఖుల రాక సందర్భంగా ఘాట్ వద్ద పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. నందమూరి కుటుంబసభ్యులతో పాటు ఎన్టీఆర్ ట్రస్ట్ ట్రస్టీ నారా భువనేశ్వరి, టీడీపీ నేతలు, అభిమానులు, రాజకీయ సినీ ప్రముఖులు, తదితరులు ఘాట్ వద్దకు చేరుకుని నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ తన తాతను స్మరించుకుంటూ ఎక్స్ వేదికగా ఓ భావోద్వేగ సందేశాన్ని పంచుకున్నారు. "మీ పాదం మోపక తెలుగు ధరిత్రి చిన్నబోతోంది. మీ రూపు కానక తెలుగు గుండె తల్లడిల్లిపోతోంది. పెద్ద మనసుతో ఈ ధరిత్రిని, ఈ గుండెని మరొక్కసారి తాకిపో తాతా. సదా మీ ప్రేమకు బానిసను" అంటూ జూనియర్ ఎన్టీఆర్ రాసుకొచ్చారు. ఈ పోస్ట్ పలువురి హృదయాలను తాకిందని, అభిమానులు "జోహార్ ఎన్టీఆర్" అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల ఆయన అభిమానులు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.

Next Story