'గుంటూరు కారం' సినిమా టికెట్ రేట్ల పెంపునకు అనుమతి
'గుంటూరు కారం' సినిమా టికెట్ ధరలు పెంచుకునేందుకు తెలంగాణ ప్రభత్వం అనుమతి ఇచ్చింది.
By Srikanth Gundamalla Published on 9 Jan 2024 4:28 PM IST
'గుంటూరు కారం' సినిమా టికెట్ రేట్ల పెంపునకు అనుమతి
సంక్రాంతికి వస్తున్న సినిమాల్లో అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తోన్న మూవీ 'గుంటూరు కారం'. మహేశ్ బాబు, తివిక్రమ్ కాంబోలో వస్తున్న మూడో సినిమా కావడంతో ఈ సినమాపై అభిమానులు, ప్రేక్షకుల్లో హైప్ పెరిగిపోయింది. అంతేకాదు.. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పాటలు.. ట్రైలర్ యూట్యూబ్లో దుమ్మురేపుతున్నాయి. మాస్ ఎంటర్టైన్మెంట్గా వస్తోన్న ఈ మూవీ కోసం అభిమానులు ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. అయితే.. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమా థియేటర్లలో విడుదల కాబోతుంది.
కాగా.. 'గుంటూరు కారం' సినిమాకు టికెట్ ధరలు పెంచుకునేందుకు తెలంగాణ ప్రభత్వం అనుమతి ఇచ్చింది. సింగిల్ స్క్రీన్లలో రూ.65, మల్టీప్లెక్స్ థియేటర్లలో రూ.100 పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. మహేశ్బాబు అభిమానులను దృష్టిలో పెట్టుకుని బెనిఫిట్ షో ప్రదర్శనలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా 23 చోట్ల ఈ నెల 12న అర్ధరాత్రి ఒంటి గంట షో ప్రదర్శించనున్నారు చిత్ర నిర్వాహకులు. మరోవైపు సంక్రాంతి పండగ కావడంతో ఆరో షో ప్రదర్శనకు కూడా రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జనవరి 12వ తేదీ నుంచి 18వ తేదీ వరకు ఉదయం 4 గంటల షోలను ప్రత్యేకంగా ప్రదర్శించనున్నారు.
గుంటూరు కారం సినిమాలో మహేశ్బాబు సరసన టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రీలీలతో పాటు మీనాక్షి చౌదరి నటించారు. ఇక రమ్యకృష్ణ, ప్రకాశ్రాజ్, జగపతిబాబు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. హాసిని, హారిక క్రియేషన్స్ పతాకంపై ఎస్.రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మించారు. తమన్ మ్యూజిక్ అందించారు.