ప్రభాస్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం 'ఫౌజీ'. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. అయితే, సెట్స్ నుండి కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో లీక్ అవ్వడంపై చిత్ర యూనిట్ తీవ్రంగా స్పందించింది. లీక్డ్ కంటెంట్ను షేర్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మేకర్స్ హెచ్చరించారు.
మైత్రీ మూవీ మేకర్స్ తమ అధికారిక 'X' (గతంలో ట్విట్టర్) ఖాతా ద్వారా ఒక ప్రకటన విడుదల చేస్తూ.. "సెట్స్ నుండి లీక్ అయిన ఫోటోలను సర్క్యులేట్ చేస్తున్న అకౌంట్లపై మా దృష్టి పడింది. దీనిని ఒక తీవ్రమైన హెచ్చరికగా భావించండి. ఇటువంటి కంటెంట్ను షేర్ చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం" అని స్పష్టం చేశారు.
థియేటర్లలో ప్రేక్షకులు పొందే అనుభూతిని ఈ లీకులు దెబ్బతీస్తాయని, వెండితెరపై చూసే విజువల్స్ కోసం వేచి చూడాలని వారు కోరారు. దర్శకుడు హను రాఘవపూడి కూడా అభిమానులకు విజ్ఞప్తి చేస్తూ.. తమ టీమ్ ఎంతో కష్టపడి ఈ చిత్రాన్ని రూపొందిస్తోందని, లీకులతో ఆ కష్టాన్ని వృధా చేయవద్దని కోరారు. ఈ సినిమాను అందరూ కలిసి థియేటర్లలోనే ఆస్వాదించాలని ఆయన ఆకాంక్షించారు.