చిత్ర ప‌రిశ్ర‌మ‌లో విషాదం.. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు క‌న్నుమూత‌

Director SP Jananathan Passes away.జాతీయ అవార్డు గ్రహీత, ప్రముఖ దర్శకుడు ఎస్‌సీ జననాథన్ క‌న్నుమూశారు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  14 March 2021 7:57 AM GMT
Director SP Jananathan Passes away

సినీ ప‌రిశ్ర‌మలో మ‌రో విషాదం చోటు చేసుకుంది. జాతీయ అవార్డు గ్రహీత, ప్రముఖ దర్శకుడు ఎస్‌సీ జననాథన్ క‌న్నుమూశారు. చెన్నైలోని అపోలో ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందారు. తీవ్ర అనారోగ్యంతో అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న డైరెక్టర్ జననాథన్ ఈ ఉదయం గుండెపోటుతో తుదిశ్యాస విడిచార‌ని మరో డైరెక్టర్ ఆర్ముగకుమార్‌ ట్వీట్‌ చేశారు. 61 ఏళ్ల జ‌న‌నాథ‌న్ అకాలమరణంపై పరిశ్రమకు చెందిన పెద్దలు ఇతర నటీనటులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు.

ప్ర‌స్తుతం ఆయ‌న విజ‌య్ సేతుప‌తి హీరోగా లాభం అనే చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ చిత్రంలో శృతిహాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ప్ర‌స్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ఎడిటింగ్ ప‌నిలో ఆయ‌న ఉన్నారు. గురువారం మ‌ధ్యాహ్నం భోజ‌నానికి వెళ్లిన ఆయ‌న ఎంత‌సేప‌టికి తిరిగి రాక‌పోవ‌డంతో ఆయ‌న గ‌దికి వెళ్లిన సిబ్బంది ఆయ‌న అప‌స్మార‌క స్థితిలో క‌నిపించారు. వెంట‌నే వారు ఆయన్ను ఆస్ప‌త్రిలో చేర్చ‌గా.. చికిత్స పొందుతూ నేడు తుది శ్వాస విడిచారు. 2003 లో వ‌చ్చిన ఇయ‌ర‌కై త‌మిళ మూవీతో ద‌ర్శ‌కుడిగా మారారు జ‌న‌నాథ‌న్‌. ఈ చిత్రం ఫీచ‌ర్స్ ఫిలిమ్స్ విభాగంలో జాతీయ అవార్డు అందుకుంది.

హీరోయిన్‌ శృతిహాసన్‌ జననాథన్ మృతిపై సంతాపం ప్రకటించారు. భారమైన హృదయంతో గుడ్‌బై చెబుతూ ట్వీట్‌ చేశారు. ఆయనతో కలిసి పనిచేసినందుకు చాలా ఆనందంగానూ గర్వంగానూ ఉంది. తన ఆలోచనలలో ఎప్పుడూ బతికే ఉంటారంటూ శృతి నివాళులర్పించారు.




Next Story