అఖిల్ నేతృత్వంలోని తెలుగు వారియర్స్ మరోసారి సెలబ్రిటీ క్రికెట్ లీగ్( సీసీఎల్) విజేతగా నిలిచింది. విశాఖలోని వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచులో భోజ్పురి దబాంగ్స్ను 9 వికెట్ల తేడాతో చిత్తు చేసి నాలుగో సారి టైటిల్ను సొంతం చేసుకుంది. అంతకముందు 2015, 2016, 2017లో వరుసగా మూడు సార్లు టైటిళ్లు చేజిక్కించుకుని హ్యాట్రిక్ నమోదు చేసింది. అయితే.. కరోనా సంక్షోభం కారణంగా గత మూడేళ్లుగా సీసీఎల్ టోర్నీ నిర్వహించలేదు.
ఈ మ్యాచులో టాస్ గెలిచిన అఖిల్ బౌలింగ్ ఎంచుకున్నాడు. బ్యాటింగ్కు దిగిన భోజ్పురి తొలి ఇన్నింగ్స్లో 6 వికెట్ల నష్టానికి 72 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్కు దిగిన తెలుగు వారియర్స్ జట్టు అఖిల్(67) రాణించడంతో 4 వికెట్ల నష్టానికి 104 పరుగులు చేసింది. అనంతరం రెండో ఇన్నింగ్స్లో భోజ్పురి 6 వికెట్లు కోల్పోయి 89 పరుగులు చేసింది. 58 పరుగుల లక్ష్యాన్ని వికెట్ నష్టపోయి తెలుగు వారియర్స్ చేధించింది. అశ్విన్, సచిన్ అజేయంగా నిలిచారు. అఖిల్ అక్కినేనికి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు దక్కాయి.
సీసీఎల్ టోర్నీని టీ20 ఫార్మాట్లో నిర్వహించారు. అయితే.. రెగ్యులర్ టీ20ల్లా కాకుండా రెండు ఇన్నింగ్స్లు ఆడాడు. తొలి ఇన్నింగ్స్కు 10 ఓవర్లు, ఆ తరువాత రెండో ఇన్నింగ్స్కు 10 ఓవర్ల చొప్పున మ్యాచ్లను నిర్వహించారు.