మెగాస్టార్‌తో స్టెప్పులేయనున్న రష్మీ..?

Anchor Rashmi Gautham special song in Bhola Shankar Movie.జ‌బ‌ర్ధ‌స్త్ కామెడి షో తో మంచి పేరు తెచ్చుకుంది

By తోట‌ వంశీ కుమార్‌  Published on  24 Nov 2021 1:33 PM IST
మెగాస్టార్‌తో స్టెప్పులేయనున్న రష్మీ..?

జ‌బ‌ర్ధ‌స్త్ కామెడి షో తో మంచి పేరు తెచ్చుకుంది యాంక‌ర్ ర‌ష్మీ గౌత‌మ్‌. బుల్లితెర‌పై యాంక‌ర్‌గా కొన‌సాగుతూనే అడ‌పాద‌డ‌పా సినిమాలోనూ న‌టిస్తోంది. తాజాగా ర‌ష్మీకి బంఫ‌ర్ ఆఫ‌ర్ వ‌చ్చిన‌ట్లు ఫిల్మ్‌న‌గ‌ర్‌లో ఓ వార్త చక్క‌ర్లు కొడుతోంది. మెగాస్టార్ చిరంజీవితో క‌లిసి ఓ పాట‌లో ర‌ష్మీ చిందులేయ‌నుంద‌ని ఆ వార్త సారాంశం.

మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తున్న తాజా చిత్రం 'భోళా శంక‌ర్‌'. మెహ‌ర్ ర‌మేష్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో చిరు సర‌స‌న మిల్లీ బ్యూటీ త‌మ‌న్నా న‌టిస్తోంది. త‌మిళ మూవీ 'వేదాళం'కు రీమేక్‌గా ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. ఇక ఈ చిత్రంలో చిరుకు చెల్లిగా స్టార్ హీరోయిన్ కీర్తి సురేశ్ న‌టిస్తోంది. ఈ చిత్రంలో అదిరిపోయే ఓ మాస్ మ‌సాలా సాంగ్ ఉంద‌ట‌. శేఖ‌ర్ మాస్ట‌ర్ కొరియోగ్ర‌ఫీలో ఈ సాంగ్‌ను షూట్ చేయ‌నున్నారు. ప్ర‌స్తుతం ఈ సాంగ్ రిహార్స‌ల్ కొన‌సాగుతున్నాయ‌ట‌. ఆ సాంగ్‌లో చిరంజీవితో పాటు యాంక‌ర్ ర‌ష్మీ గౌత‌మ్ స్టెప్పులేయ‌నుంద‌ని తెలుస్తోంది. చిరు ప‌క్క‌న స్టెప్పులేసే అదృష్టం రావ‌డం ప‌ట్ల ర‌ష్మీ ఉబ్చిత‌బ్బిబ‌వుతుంద‌ట‌. త్వ‌ర‌లోనే ఈ పాట‌ను చిత్రీక‌రించ‌నున్నారు. చిరుతో మాస్ సాంగ్ అంటే మామూలుగా ఉండదుగా మ‌రీ.

ఇదిలా ఉంటే.. చిరంజీవి న‌టించిన 'ఆచార్య' చిత్రం వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రి 4న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రంలో మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ కూడా ఓ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. చిరుకు జోడిగా కాజ‌ల్ న‌టిస్తోండ‌గా.. చ‌ర‌ణ్‌కు జోడిగా పూజా హెగ్దే న‌టిస్తోంది. చిరంజీవి, రామ్‌చ‌ర‌ణ్‌లు న‌టించిన ఈ చిత్రం కోసం మెగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.

Next Story