మంత్రి కేటీఆర్ సాయం కోరిన యాంక‌ర్ ర‌ష్మీ గౌత‌మ్‌

Anchor Rashmi Gautam sought the help of Minister KTR.యాంక‌ర్ ర‌ష్మి గౌత‌మ్‌.. ప‌రిచ‌యం అక్క‌ర‌లేని పేరు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  30 July 2021 3:25 AM GMT
మంత్రి కేటీఆర్ సాయం కోరిన యాంక‌ర్ ర‌ష్మీ గౌత‌మ్‌

యాంక‌ర్ ర‌ష్మి గౌత‌మ్‌.. ప‌రిచ‌యం అక్క‌ర‌లేని పేరు. బుల్లితెరపైనే కాకుండా వెండితెర‌పై కూడా రాణిస్తోంది. ఆమె జంతు ప్రేమికురాల‌నే విష‌యం తెలిసిందే. లాక్‌డౌన్‌లోనూ వీధి కుక్కలు, పావురాల కోసం ప్రతిరోజూ ఆహారం అందించిన సంగ‌తి తెలిసిందే. తాజాగా తెలంగాణ మంత్రి కేటీఆర్ సాయం కోరింది ర‌ష్మి. గ్రేటర్‌ హైదరాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్‌(జీహెచ్ఎంసీ) పరిధిలో శునకాలకు ఏబీసీ (యానిమల్‌ బర్త్‌ కంట్రోల్‌) ఆపరేషన్‌ చేసి అలాగే వదిలేస్తున్నారని, దీనికి ఏదైనా పరిష్కార చర్యలు తీసుకోవాలని ఆమె మంత్రి కేటీఆర్‌కు విజ్ఞ‌ప్తి చేసింది. ఈ మేరకు కేటీఆర్‌ కార్యాలయ ఖాతాతో పాటు కేటీఆర్‌ వ్యక్తిగత ట్విటర్‌ ఖాతాను ట్యాగ్‌ చేస్తూ ట్వీట్‌ చేసింది.

జీహెచ్‌ఎంసీ పరిధిలో వీధికుక్కల సంఖ్యను తగ్గించేందుకు గ‌త కొంత‌కాలంగా ఆ శునకాలకు వైద్య సిబ్బంది ఆపరేషన్‌ చేసి అలాగే వదిలి పెడుతున్నారు. ఆపరేషన్‌ తర్వాత చేయాల్సిన చికిత్స చేయకుండానే రోడ్లపైనే వదిలి పెడుతున్నారు. అయితే.. అలాంటి శునకాల ఫొటోలను వివరాలతో సహా సేవ్‌యానిమల్స్‌ఇండియా అనే ట్విటర్‌ ఖాతా ద్వారా ఓ నెటిజన్‌ కొంతకాలంగా ట్విటర్‌లో పోస్టు చేస్తూ వస్తున్నారు. ఇలా దాదాపు 2,122 శునకాలను ఆపరేషన్‌ చేసి ఇలాగే నిర్దాక్షిణ్యంగా రోడ్డుపై వదిలేశారని ఆయన ట్వీట్‌లో పేర్కొన్నారు. పై అధికారులు తమకు విధించిన రోజువారీ టార్గెట్‌ రీచ్ కావడం కోసం వైద్య సిబ్బంది ఇలా శునకాలను హింసించడం సరికాదని అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి దీనిపై మంత్రి కేటీఆర్‌ ఎలా స్పందిస్తారో చూడాలి.

Next Story