విద్యుత్ బిల్లుల చెల్లింపులు వాయిదా

By సుభాష్  Published on  14 May 2020 6:58 AM GMT
విద్యుత్ బిల్లుల చెల్లింపులు వాయిదా

దేశంలో కరోనా వైరస్‌ నేపథ్యంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో కరోనా కట్టడికి దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. ఇక ఏపీలో కూడా కరోనా తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో విద్యుత్‌ బిల్లుల విషయంలో ఏపీ సర్కార్‌ కీలక నిర్ణయం తీసుకుంది. బిల్లుల చెల్లింపునకు వెసులుబాటు కల్పించింది. జూన్‌ 30వ తేదీ వరకూ విద్యుత్‌ బిల్లులు వాయిదా వేయాలని పంపిణీ సంస్థలకు జగన్‌ ఆదేశించారు. ఏపీలో విద్యుత్‌ బిల్లులు అత్యధికంగా వచ్చాయి. దీనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. లాక్‌డౌన్‌ సమయంలో వేలకొద్ది విద్యుత్‌ బిల్లులు రావడంపై ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

దీంతో విద్యుత్‌ బిల్లులు చెల్లించేందుకు జూన్‌ 30వ తేదీ వరకూ వాయిదా వేయాలని జగన్‌ సర్కార్‌ నిర్ణయం తీసుకుంది. అంతేకాదు బిల్లులపై నెలకొన్న అనుమానాలను తొలగించేందుకు ప్రతీ వినియోగదారుడికి లేఖ రాయాలని ఇంధన శాఖ నిర్ణయించింది.

45 కోట్ల విద్యుత్‌ వినియోగదారులకు వ్యక్తిగతంగా లేఖలు రాసే బాధ్యతను విద్యుత్‌ పంపిణీ సంస్థలకు సీఎండీలకు అప్పగించింది. అయితే కరోనా వైరస్‌ కారణంగా మీటర్‌ రీడింగ్‌ సిబ్బంది గత నెలల బిల్లుల ఆధారంగానే బిల్లులు జారీ చేశారు.

కాగా, ఏపీలో కరోనా నేపథ్యంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది ఏపీ సర్కార్‌. లాక్‌డౌన్‌ కారణంగా ప్రజలకు తలెత్తుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుంటోంది.

Next Story