క‌రోనా ఎఫెక్ట్‌.. సివిల్స్ ప్రిలిమినరీ ఎగ్జామ్స్ వాయిదా

civil services examination postponed. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(UPSC) కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ప్రిలిమ్స్ ప‌రీక్ష‌ను వాయిదా వేసింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  13 May 2021 12:40 PM GMT
civil services examination postponed

దేశంలో క‌రోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. గ‌త కొద్ది రోజులుగా ల‌క్ష‌ల్లో పాజిటివ్ కేసులు న‌మోదు అవుతుండ‌గా.. వేల సంఖ్య‌లో ప్ర‌జ‌లు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేప‌థ్యంలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(UPSC) కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ప్రిలిమ్స్ ప‌రీక్ష‌ను వాయిదా వేసింది. ఈ ఏడాది జూన్ 27న జ‌ర‌గ‌నున్న ప్రిలిమ్స్ ప‌రీక్ష‌ల‌ను అక్టోబ‌ర్ 10న నిర్వ‌హించ‌నున్న‌ట్లు గురువారం ఓ ప్ర‌క‌ట‌న‌లో వెల్ల‌డించింది. ఐఏఎస్, ఐసీఎస్, ఐఎఫ్ఎస్ సహా 23 సర్వీసుల్లో నియాకం కోసం యూపీఎస్సీ.. సివిల్​ సర్వీసెస్​ పరీక్షలను ఏటా ప్రిలిమినరీ, మెయిన్​, ఇంటర్వ్యూ అని మూడు దశల్లో నిర్వహిస్తుందన్న సంగ‌తి తెలిసిందే.

గ‌తేడాది కూడా క‌రోనా కార‌ణంగా సివిల్ స‌ర్వీసెస్ ప‌రీక్ష‌ల‌ను వాయిదా వేసిన విష‌యం తెలిసిందే. మే 31న జ‌ర‌గాల్సిన ఈ ప‌రీక్ష‌ల‌ను అక్టోబ‌ర్ 4కు రీ షెడ్యూల్ చేసింది. ఇప్ప‌టికే రాత ప‌రీక్ష‌లు పూర్తికాగా.. ఇంట‌ర్వ్యూలు పెండింగ్‌లో ఉన్నాయి. క‌రోనా విజృంభిస్తుండ‌డంతో యూపీఎస్సీ అన్ని ప‌రీక్ష‌ల‌ను వాయిదా వేసింది. ఈపీఎఫ్‌వోలో ఇన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీస‌ర్ ఉద్యోగాల భ‌ర్తీ కోసం మే 9న జ‌ర‌గాల్సిన ప‌రీక్ష‌ల‌ను వాయిదా వేసింది. వాయిదా వేసిన పరీక్ష‌లు, ఇంట‌ర్వ్యూల త‌దుప‌రి తేదీల‌ను అభ్య‌ర్థుల‌కు క‌నీసం 15 రోజుల ముందుగానే స‌మాచారం ఇవ్వ‌నున్న‌ట్లు చెప్పింది.


Next Story