తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫలితాల విడుదలకు ముహూర్తం ఖరారైంది. హైదరాబాద్లోని ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయంలో నేడు ఉదయం 11 గంటలకు ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలను అధికారికంగా విడుదల చేయనున్నారు. ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు, విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా ఈ ఫలితాలను ప్రకటిస్తారు. మార్చి 13వ తేదీతో ముగిసిన ఈ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 9.50 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. పరీక్షలు పూర్తయిన నెల రోజుల్లోనే బోర్డు ఫలితాలను వెల్లడిస్తుండటం విశేషం. విద్యార్థులు తమ మార్కులను www.tgbie.cgg.gov.in అనే అధికారిక వెబ్సైట్ ద్వారా చూసుకోవచ్చు.
ఈ ఏడాది విద్యార్థుల సౌకర్యార్థం ప్రభుత్వం సరికొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. వెబ్సైట్లతో పాటు ఇప్పుడు నేరుగా వాట్సప్ (WhatsApp) ద్వారా కూడా ఫలితాలను పొందే వీలుంది. ఈ వినూత్న సదుపాయాన్ని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు సచివాలయంలో ప్రారంభించారు. స్మార్ట్ ఫోన్ ఉన్న విద్యార్థులు 8096958096 అనే నంబరుకు వాట్సప్లో ‘Hi’ అని సందేశం పంపాలి. ఆ తర్వాత అందులో వచ్చే సూచనల ప్రకారం.. విద్యార్థి రోల్ నంబరు, సంవత్సరం, గ్రూపు వివరాలను నమోదు చేస్తే వెంటనే వారి ఫలితాలు వాట్సప్ స్క్రీన్పై కనిపిస్తాయి.