కృష్ణానదిలో దూకి డాక్టర్ ఆత్మహత్య
By సుభాష్ Published on 24 Aug 2020 9:36 AM ISTఓ డాక్టర్ కృష్ణానదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సంచలనం రేపింది. ఆదివారం రాత్రి అందరూ చూస్తుండగానే కృష్ణానదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. భార్యాభర్తల మధ్య తలెత్తిన వివాదాల కారణంగా ఈ ఘటనకు పాల్పడినట్లు తెలుస్తోంది. ప్రకాశం జిల్లాకు చెందిన డాక్టర్ అద్దేపల్లి శ్రీనివాస్ (40) గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్నారు. గుంటూరు కొత్తపేటలో భార్యాపిల్లలతో ఉంటున్నారు.
ఆదివారం రాత్రి డాక్టర్ శ్రీనివాస్ ప్రకాశం బ్యారేజీ వద్దకు చేరుకుని ప్రకాశం విగ్రహం వద్ద మెయిన్ కెనాల్లోకి దూకాడు. అయితే అంతకు ముందు తన జేబులో ఉన్న ఐడీకార్డు, ఆధార్, ఫోన్లను తీసి పక్కనపెట్టేశాడు. ఈ ఘటనను చూసిన కొందరు పోలీసులకు సమాచారం అందించారు. అక్కడే ఉన్న విజయవాడ వన్టౌన్ సీఐ వెంకటేశ్వర్లు తన సిబ్బందితో కలిసి తాడు సాయంతో శ్రీనివాస్ను రక్షించే ప్రయత్నంచగా, నీటి ఉధృతి ఎక్కువ ఉండటంతో అందరు చూస్తుండగానే శ్రీనివాస్ మునిగిపోయాడు. ఆయన దూకే ముందు వదిలేసిన ఫోన్ ఆధారంగా తండ్రికి ఫోన్ చేయగా, భార్యాభర్తల మధ్య గొడవ జరిగిందని తండ్రి తెలిపినట్లు సమాచారం. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.