ఢిల్లీ ఎన్నికల హోరాహోరీ
By అంజి Published on 8 Feb 2020 3:50 AM GMTఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. 70 స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలు జరుగుతున్నాయి. 13,750 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎన్నికల బరిలో 672 మంది అభ్యర్థులు ఉన్నారు. ఢిల్లీలో అత్యధికంగా పురుష ఓటర్లు 81,05,236 మంది, మహిళా ఓటర్లు 66,80,277 మంది ఉన్నారు. మొత్తం 1.5 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోంటున్నారు.
సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. పోలింగ్ నేపథ్యంలో పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. 190 కంపెనీల కేంద్ర బలగాలతో, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 42 వేల మంది పోలీసులు, 19 వేల మంది హోంగార్డులు పోలింగ్ కేంద్రాల వద్ద పహరా కాస్తున్నారు. ఈ నెల 11న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. కాగా ఈ ఎన్నికల్లో ప్రధానంగా బీజేపీ, ఆమ్ఆద్మీ పార్టీల మధ్య పోటీ నెలకొంది.
కేంద్ర ప్రభుత్వ పనితీరు ఆధారంగానే గెలుపు తీరం చేరుకోవాలని బీజేపీ ఆశిస్తుండగా, ఢిల్లీలో తాము చేసిన సంక్షేమ కార్యక్రమాలనే తమ పార్టీకి విజయాన్ని అందిస్తాయని ఆమ్ఆద్మీ పార్టీ నేతలు నమ్ముతున్నారు. 2013 సంవత్సరం వరకు 15 సంవత్సరాలు ఢిల్లీని పాలించిన కాంగ్రెస్ ఈ సారి ముందే చెతులేత్తెసింది. ఈ సారి జరిగిన ఢిల్లీ ఎన్నికల్లో చాలా వరకు ఉద్వేగపూరిత ప్రచార కార్యక్రమాలు జరిగాయి. పలు నియోజకవర్గాల్లో బీజేపీని ఎదురుదెబ్బ కొట్టడానికి ఆప్ పార్టీకి కాంగ్రెస్ పరోక్షంగా సహకరిస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఆప్ కంటే ఎక్కువ ఓట్లు సాధించిన స్థానాల్లో మాత్రమే కాంగ్రెస్ బలమైన అభ్యర్థులను పోటీలోకి దించింది.